ODI Wolrd Cup 2023 : వన్డే వరల్డ్ కప్ పోటీలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో, భారత్ సహా పలు జట్లు ఈ మెగా టోర్నీలో ఆడే 15మందితో కూడిన బృందాన్ని ప్రకటించాయి. ఐసీసీ(ICC) కూడా ఓపెనింగ్ మ్యాచ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 5న నిర్వహించే ఆరంభ పోరుకి ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఇద్దరిని ఎంపిక చేసింది. భారత్కు చెందిన నితిన్ మీనన్(Nitin Menon), శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన (Kumar Dharmasena) ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తారని ఐసీసీ తెలిపింది.
పాల్ విల్సన్(Paul Wilson) టీవీ అంపైర్గా, సైకత్(Saikat) ఫోర్త్ అంపైర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ మ్యాచ్కు భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్(Javagal Srinath) మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్టు వెల్లడించింది. భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి. ఈ టోర్నీ మొత్తానికి 16 మంది అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వీళ్లలో 12 మంది ఐసీసీ అంపైర్స్ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యులు. మిగతా నలుగురు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్కు చెందినవాళ్లు.
JUST IN: Match officials for #CWC23 announced 👇
— ICC (@ICC) September 8, 2023
క్రిస్ బ్రౌన్, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానే, మైఖేల్ గాఫ్, అడ్రియాన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, నితిన్ మీనన్, అహ్సన్ రజా, పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాయిద్, రాడ్ టక్నర్, అలెక్స్ వార్ఫ్, జోఎల్ విల్సన్, పాల్ విల్సన్.
ప్రపంచ కప్ ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అక్టోబర్ 14న అహ్మదాబాద్లో ఎదురుపడనున్నాయి. మొత్తం 10 జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ విజేత ఎవరో నవంబర్ 19న తేలిపోనుంది. ఈసారి ఫైనల్తో పాటు సెమీఫైనల్స్కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు.