హైదరాబాద్, ఆట ప్రతినిధి : మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్ హుస్సేన్ సాగర్ వేదికగా మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆతిథ్యం ఇస్తోన్న ఈ ఈవెంట్ తొలి రోజు పోటీలకు వాతావరణం ప్రతికూలంగా మారడంతో మూడు రేసులకు ఒక్కటే నిర్వహించారు. అండర్-15 విభాగంలో జాతీయ ఛాంపియన్ రవి బన్నెలు (వైసీహెచ్) లైన్ జంప్ చేసి డిస్క్వాలిఫై కాగా, రమీజా భాను, లోకేష్ కూడా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే, హైదరాబాద్కు చెందిన 13 ఏండ్ల నిల్కొండ మణి తొలి రేసులో టాప్ప్లేస్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలికల విబాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ టాప్ సీడ్లుగా బరిలోకి దిగిన జాతీయ చాంపియన్ శృంగారి రాయ్ (సికింద్రాబాద్ క్లబ్), తెలంగాణ నంబర్ 2 ప్లేయర్ రమీజా భానును వెనక్కి నెట్టి అగ్రస్థానం సొంతం చేసుకుంది.