Nikhat Zareen | సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. బల్గేరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల సెమీఫైనల్లో శనివారం నిఖత్ 5-0తో స్థానిక బాక్సర్ చుకునవాపై ఘన విజయం సాధించింది. తొలి రౌండ్లో కాస్త వెనుకబడ్డ ఈ ఇందూరు బాక్సర్ ఆ తర్వాత తన పంచ్ పవర్ చాటింది.
వరుస పంచ్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. జాబ్లు, హుక్లతో బల్గేరియా బాక్సర్ను ముప్పుతిప్పలు పెట్టడంతో మ్యాచ్ను ముగించింది. ఆదివారం జరగనున్న స్వర్ణ పతక పోరులో సబీనాతో నిఖత్ తలపడనుంది. పురుషుల విభాగంలో అమిత్ పంగాల్ తుదిపోరుకు అర్హత సాధించాడు. ఈ ఇద్దరితో పాటు మరో నలుగురు భారత బాక్సర్లు కూడా ఫైనల్లో అడుగుపెట్టారు. అరుంధతి (66 కే), బరున్ (48 కే), సచిన్ (57 కే), రజత్ (67 కే) ఈ జాబితాలో ఉన్నారు.