న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై తమ సత్తాచాటుతూ డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సహా ఎనిమిది మంది భారత బాక్సర్లు క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన వేర్వేరు ప్రిక్వార్టర్స్ బౌట్లలో ప్రత్యర్థులపై విజయాలతో నిఖత్ జరీన్, మనీశా మౌన్, నీతూ గంగాస్, జాస్మిన్ పతక వేటలో ముందంజ వేశారు.
మహిళల 50కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్ 5-0 తేడాతో పాట్రిసియా అల్వారెజ్ హెరెరాపై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన నిఖత్ ప్రత్యర్థి కదలికలను చురుగ్గా గమనిస్తూ ఎత్తుకు పై ఎత్తు వేసి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కచ్చితమైన పంచ్లు, జాబ్స్, హుక్స్తో మెక్సికో బాక్సర్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు నీతూ..సుమైయ క్యాసిమోవాపై, మనీశ..నూర్ ఎలీఫాపై, జాస్మిన్..సమదోవాపై అలవోక విజయాలు సొంతం చేసుకున్నారు.