భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి తొలి టెస్టులో తిరుగులేని విజయం సాధించిన టీమ్ఇండియాకు.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్వాత వన్డే సిరీస్లో వైట్ వాష్కు గురైంది. ఈ పర్యటనతో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి సీనియర్ ప్లేయర్లపై వేటు పడటం దాదాపుగా ఖాయం కాగా.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీ స్థానంలో కొత్త సారథి ఎంపిక అనివార్యమైంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో భవిష్యత్తు కెప్టెన్గా భావిస్తున్న కేఎల్ రాహుల్కు ఆదిలోనే హంసపాదు ఎదురు కాగా.. వన్డే సిరీస్లో మిడిలార్డర్ డొల్లతనం మరోసారి బయటపడింది! టీమ్ఇండియా తదుపరి సిరీస్ స్వదేశంలో వెస్టిండీస్తో ఆడనున్నా.. విదేశాల్లో నిలకడగా రాణించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని మరోమారు రుజువైంది!
గతంతో పోల్చుకుంటే విదేశాల్లో నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా.. మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డపై ఊరిస్తున్న టెస్టు సిరీస్ను మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. తొలి టెస్టులో విజయం సాధించిన కోహ్లీసేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి ప్రత్యర్థికి సిరీస్ అప్పగించింది. సుదీర్ఘ ఫార్మాట్లో పరాజయం అనంతరం స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలుకడం.. జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తడం వంటి అనేక అవాంతరాల మధ్య వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైంది. రెగ్యులర్ సారథిగా ఎంపికైన తర్వాత జట్టు తొలిసారి ఆడిన వన్డే సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును విజయాల బాటలో నడిపించలేకపోయాడు. భవిష్యత్ కెప్టెన్గా భావిస్తున్న రాహుల్కు తొలి సిరీస్లో పరాజయం పలకరించగా.. ఈ పర్యటనతో జట్టులోని లోపాలు బయటపడ్డాయి. లోయర్ ఆర్డర్లో శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన చోట.. మిడిలార్డర్ ఆటగాళ్లు ప్రభావం చూపకపోవడం ప్రధాన సమస్య కాగా.. కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ బంతిని గింగిరాలు తిప్పిన చోట.. అశ్విన్, చాహల్ సత్తాచాటలేకపోవడం భారత్ను దెబ్బ కొట్టింది. వన్డే సిరీస్లో రెండేసి అర్ధశతకాలు సాధించిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ తమ అనుభవాన్ని చాటగా.. మిగిలిన ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యారు. జట్టు కూర్పు విషయంలో కాస్త తేడా కొట్టిందని ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించగా.. ఈ ఏడాది ఆఖర్లో టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టింది.
భారత్కు భారీ జరిమానా
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి వన్డేలో ఓటమిపాలైన భారత్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్రేట్ కారణంగా ఐసీసీ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది. కేప్టౌన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలోగా భారత్ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం ఒక ఓవర్కు 20 శాతం చొప్పున.. రెండు ఓవర్లకు కలిపి 40 శాతం ఫీజు కోత విధిస్తూ ఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది.