‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే’.. అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల టీమ్ఇండియా పఠిస్తున్న మంత్రమిది. మర్యాదగా వ్యవహరిస్తే జెంటిల్మెన్ గేమ్లో మమ్మల్ని మించిన ప్రత్యర్థులు లేరని నిరూపిస్తూనే.. ఉసిగొల్పితే మాత్రం సునామీని తట్టి లేపినట్లే అని కోహ్లీసేన హెచ్చరిస్తున్నది. మొన్న మొన్నటి వరకు విరాట్ ఒక్కడే దూకుడుగా వ్యవహరిస్తాడనుకుంటే.. తాజా లార్డ్స్ టెస్టులో యావత్ భారత జట్టు ‘నాయకుడి వెంటే మేమూ’ అని నిరూపించింది. ‘మాలో ఒక్కడిని తిడితే.. మా అందరినీ అన్నట్లే లెక్క’ అని మ్యాచ్ అనంతరం రాహుల్ అన్న మాటలు జట్టు దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా గబ్బా టెస్టులో కంగారూల మాటలకు మాటలతోనే సమాధానం చెప్పిన టీమ్ఇండియా.. తాజా ఇంగ్లండ్ టూర్లోనూ తగ్గేదే లే అంటున్నది. భారత ఆటగాళ్ల ఈ నయా వ్యవహార శైలిపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో తన ఆటతోనే కాకుండా మైదానంలో దూకుడు స్వభావం వల్ల కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించని తత్వం.. చివరి క్షణం వరకు విజయం కోసం పోరాడే నైజం.. సహచరులకు వెన్నుదన్నుగా నిలిచే నాయకత్వం వల్ల అతడు సారథిగా విజయవంతమవుతూ వస్తున్నాడు. నాయకత్వ పగ్గాలను మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ నుంచే అందుకున్నా.. కెప్టెన్సీలో మాత్రం గంగూలీని మించిన దూకుడు కొనసాగిస్తున్నాడు. అయితే ప్రస్తుత జట్టును పరిశీలిస్తే.. సహచరులు కూడా విరాట్ను ఫాలో అవుతున్నారనేది సుస్పష్టం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలను గమనించిన వారికి ఈ విషయం ఇట్టే అవగతమవుతుంది. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా.. ఆ ఘోర పరాభవం నుంచి కోలుకొని మెల్బోర్న్ టెస్టులో విజయ ఢంకా మోగించడంతో పాటు చారిత్రక టెస్టు సిరీస్ గెలుచుకోవడంలో దూకుడే ప్రధాన పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదు.
‘వాళ్లకు నరకం కనబడాలి’
లార్డ్స్ టెస్టు విషయానికి వస్తే.. భారత ఆటగాళ్ల శరీర భాష ఈ మ్యాచ్లో ప్రధాన పాత్ర పోషించింది. ప్రత్యర్థిని రెండోసారి ఆలౌట్ చేసేందుకు రెండు సెషన్లే అందుబాటులో ఉన్నా.. మన ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా విజయం కోసమే పోరాడారు. ‘ఈ 60 ఓవర్లు వాళ్లకు క్రీజులో నరకం కనిపించాలి’బరిలో దిగే ముందు కెప్టెన్ కోహ్లీ.. జట్టు సభ్యులకు చెప్పిన మాటలివి. దీన్ని బట్టి మనవాళ్లు లార్డ్స్లో ఎంత కసిగా పోరాడారో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్, ఇంగ్లండ్పై మాత్రమే ఇలాంటి దూకుడు కనబరుస్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో ఆడుతున్నప్పుడు మాత్రం పక్కా ప్రొఫెషనల్గా దర్శనమిస్తున్నది. ప్రత్యర్థి మమ్మల్ని గౌరవిస్తే.. వారిని తిరిగి ఎలా గౌరవించాలో మాకు బాగా తెలుసు అని చూపుతున్న విరాట్.. అదే జట్టు సభ్యుల్లో ఎవరినైనా ఒక్క మాట అంటే మాత్రం వారిని చీల్చి చెండాడుతామని చెప్పకనే చెబుతున్నాడు. లార్డ్స్లో ఇంగ్లండ్ చివరి వికెట్ తీసిన సమయంలో సిరాజ్ సంబురాలు అంబురాన్నంటితే.. విరాట్ కోహ్లీవి అంతకు మించిపోయాయి. ఈ స్వభావమే అంతర్జాతీయ క్రికెట్కు నయా భారత్ను పరిచయం చేస్తున్నది.
బుమ్రాను రెచ్చగొట్టి..
లార్డ్స్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విజయంపై ఎవరికీ ఆశలు లేవు! ‘డ్రా’చేసుకోవడం, ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టడం.. ఈ రెండే దారులు కనిపించాయి. ఇలాంటి సమయంలో చివరి రోజు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బౌలర్లను విసిగించారు. అచ్చమైన టెస్టు ఆటగాళ్లను తలపిస్తూ ఇంగ్లిష్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 20 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జంట 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించింది. దీంతో చిర్రెత్తుకుపోయిన ఇంగ్లండ్ బౌలర్లు తమ నోటికి పనిచెప్పారు. బుమ్రాను లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగడంతో పాటు.. అతడి శరీరంపైకి బంతులు ఎక్కుపెట్టి పదే పదే షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఈ కసినంతా మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంతకంతా బదులు తీర్చుకున్నాడు. కేవలం మాటలతోనే కాకుండా ఆటతోనూ అదరగొట్టిన టీమ్ఇండియా.. క్రికెట్ మక్కా లార్డ్స్లో మూడో విజయంతో అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.