క్రైస్ట్చర్చ్: టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ్యాచ్లో చివరి బంతికి పరుగు తీసి గట్టెక్కింది. దీంతో లంక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. 285 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 28/1తో సోమవారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 8 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.
వర్షం కారణంగా రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయినా.. పట్టువదలని కివీస్ విజయతీరాలకు చేరింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (121 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో ఆపద్బాంధవుడిలా చివరి వరకు క్రీజులో నిలువగా.. డారిల్ మిషెల్ (81; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. లంక బౌలర్లలో అసిత 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 373 రన్స్ కొట్టింది. అనంతరం లంక రెండో ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది. డారిల్ మిషెల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.