ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఏడో వేతన సవరణ (యూజీసీ) అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వేతనాలను సవరించి, పెరిగిన జీతాన్ని కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ చెల్లించాలని యూనివర్సిటీల టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) ప్రతినిధులు బుధవారం ఆమెకు వినతిపత్రం అందజేయగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. కమిటీ నివేదికను రెండుమూడ్రోజుల్లో వచ్చేలా చూస్తానని హామీఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు ఎ పరుశురాం, ప్రతినిధులు బైరి నిరంజన్, ప్రేమయ్య, అంబటి శ్రీనివాస్, బాలకోటి, రామకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ప్రియ, కాంతారెడ్డి, అభిలాష్, ధీరజ్, భాస్కర్ ఉన్నారు.