సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. తొలి వన్డేలో పంజా విసిరింది. టాప్-3 రాణించడంతో టీమ్ఇండియా మూడొందల పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆడుతూ పాడుతూ సాగిన
కివీస్ మరో మూడు ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ చేజ్ చేసింది. జమ్ము ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్
వన్డే అరంగేట్రంలోనే తన వేగంతో కట్టిపడేసినా.. లాథమ్, విలియమ్సన్ మెరుపుల ముందు అతడి ప్రదర్శన మసకబారింది.
ఆక్లాండ్: పరుగుల వరద పారిన తొలి వన్డేలో న్యూజిలాండ్దే పైచేయి అయింది. భారత టాపార్డర్ రాణించినా.. యాంకర్ ఇన్నింగ్స్ కొరవడటంతో ధవన్ సేనకు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మొదటి వన్డేలో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధవన్ (72), శుభ్మన్ గిల్ (50) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. సంజూ శాంసన్ (36) పర్వాలేదనిపించాడు.
ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రిషబ్ పంత్ (15) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్ (4) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 309 రన్స్ చేసింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145 నాటౌట్; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కగా.. కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్కు 221 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. మన బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టాడు. లాథమ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హామిల్టన్లో రెండో వన్డే జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 306/7 (శ్రేయస్ 80, ధవన్ 72; ఫెర్గూసన్ 3/59, సౌథీ 3/73), న్యూజిలాండ్: 47.1 ఓవర్లలో 309/3 (లాథమ్ 145 నాటౌట్; విలియమ్సన్ 94; ఉమ్రాన్ మాలిక్ 2/66).