తొలి టెస్టును కొద్దిలో చేజార్చుకున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి ఐదు వికెట్ల దూరంలో నిలిచింది! బ్యాటింగ్ ఆర్డర్ బాధ్యతాయుత ప్రదర్శనకు.. బౌలర్ల సహకారం తోడవడంతో కోహ్లీసేన పటిష్ట స్థితికి చేరితే.. కొండంత లక్ష్యఛేదనలో కివీస్ ఇప్పటికే
సగం వికెట్లు కోల్పోయింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయమే కాగా.. బ్లాక్క్యాప్స్ ఏమేరకు పోరాడుతుందనేది చూడాలి!
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో రెండో టెస్టులో విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసి.. ఆనక ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన కోహ్లీసేన.. కివీస్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. రెండో సారి బ్యాటింగ్కు దిగి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్నైట్ స్కోరు 69/0తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్.. 276/7 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి.. కివీస్కు 540 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ శతకంతో చెలరేగిన మయాంక్ అగర్వాల్ (62; 9 ఫోర్లు, ఒక సిక్సర్) రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్సెంచరీ నమోదు చేసుకోగా.. ఓపెనర్గా బరిలోకి దిగిన చతేశ్వర్ పుజారా (47; 6 ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్మన్ గిల్ (47; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ విరాట్ కోహ్లీ (36), అక్షర్ పటేల్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టగా.. భారత సంతతికే చెందిన మరో స్పిన్నర్ రచిన్ రవీంద్రకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్కు దిగిన న్యూజిలాండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. మిచెల్ (60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా.. నికోల్స్ (36), రచిన్ (2) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. విజయానికి ఇంకా 400 పరుగుల దూరంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో సోమవారమే ఫలితం రావడం దాదాపు ఖాయమైనట్లే!
లక్ష్యం 540.. ప్రస్తుతం 140
ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్న.. ఆటగాళ్లకు ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో విరాట్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపగా.. ఈ అవకాశాన్ని టాపార్డర్ సద్వినియోగ పర్చుకుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మయాంక్ మరోసారి చక్కటి షాట్లతో ఆకట్టుకోగా.. గత కొన్నాళ్లుగా టచ్ దొరక్క ఇబ్బందిపడుతున్న సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ధాటిగా ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్కు 107 పరుగులు జోడించి మెరుగైన పునాది వేయగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శుభ్మన్ గిల్ కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే మంచి ఆరంభాలను భారీ స్కోరుగా మలచలేని తన బలహీనతను గిల్ మరోసారి బయట పెట్టుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ టీ20 తరహాలో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడాడుకున్నాడు. ఇక భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే కివీస్ స్టాండిన్ కెప్టెన్ టామ్ లాథమ్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్ వికెట్ల వేట ప్రారంభించగా.. విల్ యంగ్ (20), రాస్ టేలర్ (6) ఎక్కువసేపు నిలువలేకపోయారు. దీతో కివీస్ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోసారి స్వల్ప స్కోరుకే కుప్పకూలుతుందేమో అనుకుంటున్న తరుణంలో మిచెల్, నికోల్స్ కాసేపు పోరాడారు. ఈ జోడీ నాలుగో వికెట్కు 73 పరుగులు జోడించాక మిచెల్ను అక్షర్ పటేల్ బుట్టలో వేసుకున్నాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి బ్లండెల్ రనౌట్ కాగా.. రచిన్ రవీంద్రతో కలిసి మరో వికెట్ పడకుండా నికోల్స్ రోజును ముగించాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్ది స్పిన్నర్లకు సహకరిస్తున్న పిచ్పై సోమవారం కివీస్ ఎంతసేపు పోరాడుతుందనేది ఆసక్తికరం!
మయాంక్, శుభ్మన్కు గాయాలు
భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ ఆదివారం ఫీల్డింగ్కు దిగలేదు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మయాంక్ మోచేతికి గాయం కాగా.. శనివారం షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ చేతి వేలికు గాయమైంది. దీంతో విరిద్దరూ మూడో రోజు మైదానానికి దూరంగా ఉండగా.. వీరి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ సబ్స్టిట్యూట్గా ఫీల్డ్లోకి వచ్చారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 325, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62, భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) యంగ్ (బి) అజాజ్ 62, పుజారా (సి) అజాజ్ 47, గిల్ (సి) లాథమ్ (బి) రచిన్ 47, కోహ్లీ (సి) రచిన్ 36, శ్రేయస్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) అజాజ్ 14, సాహా (సి) జెమీసన్ (బి) రచిన్ 13, అక్షర్ (నాటౌట్) 41, జయంత్ (సి అండ్ బి) అజాజ్ 6, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 70 ఓవర్లలో 276/7 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-107, 2-115, 3-197, 4-211, 5-217, 6-238, 7-276, బౌలింగ్: సౌథీ 13-1-31-0, అజాజ్ 26-3-106-4, జెమీసన్ 8-2-15-0, సోమర్విల్లె 10-0-59-0, రచిన్ 13-2-56-3.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) అశ్విన్ 6, యంగ్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 20, మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ 60, టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6, నికోల్స్ (నాటౌట్) 36, బ్లండెల్ (రనౌట్) 0, రచిన్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 45 ఓవర్లలో 140/5. వికెట్ల పతనం: 1-13, 2-45, 3-55, 4-128, 5-129, బౌలింగ్: సిరాజ్ 5-2-13-0, అశ్విన్ 17-7-27-3, అక్షర్ 10-2-42-1, జయంత్ 8-2-30-0, ఉమేశ్ 5-1-19-0.