ఒకప్పుడు కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే అభిమానులకు ధైర్యం. ఎదురుగా కొండంత లక్ష్యం ఉన్నా కోహ్లీ ఉన్నంత సేపు విజయం మనదే అనే ఆశ. అలాంటిది గడిచిన రెండేళ్లలో కోహ్లీ గాడి తప్పాడు. అతను క్రీజులోకి వచ్చాడంటే.. కనీసం ఒక ఓవర్ అయినా ఆడతాడా? అనుకునేలా అతని ఆట సాగుతోంది. అన్ని రకాల కెప్టెన్సీలను పక్కనపెట్టేసి ఈ ఐపీఎల్లో అడుగుపెట్టిన అతను.. పూర్వపు విరాట్ను చూపిస్తాడని అభిమానులు ఆశించారు.
కానీ అలా జరగలేదు. ఇప్పటి వరకు ఆరు ఐపీఎల్ మ్యాచులు ఆడిన కోహ్లీ.. 23.80 సగటుతో కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ తొలి మ్యాచ్లో 41 పరుగులతో అజేయంగా నిలిచిన అతను.. ముంబైతో జరిగిన మ్యాచ్లో 48 పరుగులకు అవుటయ్యాడు. మిగతా మ్యాచుల్లో అతను ఏమాత్రం ప్రభావం చూపలేదు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ఏకంగా తొలి బంతికే గోల్డెన్ డక్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఐపీఎల్లో కోహ్లీ ఇలా గోల్డెన్ డక్గా వెనుతిరగడం దాదాపు ఐదేళ్ల కాలంలో ఇది తొలిసారి కావడం గమనార్హం.
దీన్ని చూసిన మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. కోహ్లీ ఇంతలా ఇబ్బంది పడటం తానెప్పుడూ చూడలేదన్నాడు. అయితే ఇలా కష్టాల్లో ఉన్నప్పుడే మన గురించి మనకు మరింత బాగా తెలుస్తుందని, కోహ్లీ కూడా త్వరలోనే ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘గత రెండేళ్లలో బయో బబుల్స్, క్వాంరటైన్ వంటి వాటి వల్ల సమస్యలు ఉండటం వాస్తవమే. అయితే ఇప్పుడు నెమ్మదిగా ప్రేక్షకులు స్టేడియాలకు వస్తున్నారు. కోహ్లీ కూడా మళ్లీ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు’’ అని చెప్పాడు.