హైదరాబాద్: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో అనూహ్య రీతిలో కోహ్లీ సూపర్ షో ప్రదర్శించాడు. 82 రన్స్ చేసి నాటౌట్గా నిలిచిన ఆ మ్యాచ్ గురించి కోహ్లీ ఇవాళ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేశాడు. అక్టోబర్ 23, 2022న జరిగిన ఆ మ్యాచ్ ప్రత్యేకమైందని, ఆ రోజు నా గుండెలో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని కోహ్లీ తన ఇన్స్టాలో పేర్కొన్నాడు. గతంలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడినా.. ఆ నాటి మ్యాచ్లో తనలో ఉన్న శక్తిని గతంలో ఎన్నడూ చూడలేదన్నాడు. ఆ నాటి సాయంత్రం ఓ అద్భుతమైన జ్ఞాపకమని కోహ్లీ తన ఇన్స్టాలో తెలిపాడు.
వరల్డ్కప్లో సూపర్12లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో కోహ్లీ కిరాక్ బ్యాటింగ్ చేశాడు. చివరి రెండు ఓవర్లలో భారీ షాట్లు ఆడి .. ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నషీమ్ షాలను కోహ్లీ ఇరగదీశాడు. ఫైనల్ ఓవర్ వేసిన స్పిన్నర్ నవాజ్ను కూడా కోహ్లీ దంచికొట్టాడు. దీంతో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. వరల్డ్కప్లో 98.66 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 296 రన్స్ స్కోర్ చేశాడు. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.