వచ్చాడు.. విసిరాడు.. వెళ్లాడు..అంతే ఒకే ప్రయత్నంలో ఫైనల్కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లోనూ అదే జోరు కొనసాగించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే బరిసెను 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు దూసుకెళ్లాడు!
యుజీన్ (అమెరికా): యావత్ భారతావని ఆశలు మోస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అడుగుపెట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. అద్వితీయ ప్రదర్శనతో అదుర్స్ అనిపించాడు. ఈ మెగాటోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క పతకం (అంజూబాబి జార్జ్; లాంగ్జంప్లో కాంస్యం) సాధించగా.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచేందుకు తానున్నానంటూ నీరజ్ విజయ గర్జన చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్లో నీరజ్.. బరిసెను 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు చేరాడు. 83.50 మీటర్ల ప్రదర్శన నమోదు చేసుకున్న వాళ్లు నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. 24 ఏండ్ల నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఆ మార్క్ను దాటాడు. దీంతో మిగిలిన రెండు ప్రయత్నాలు విరమించుకున్నాడు. ఓవరాల్గా డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 89.91 మీ.) అగ్రస్థానం దక్కించుకోగా.. నీరజ్ రెండో ప్లేస్లో నిలిచాడు. 2017 (లండన్) ప్రపంచ చాంపియన్షిప్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన నీరజ్.. గాయం కారణంగా 2019 చాంపియన్షిప్లో బరిలోకి దిగలేదు. ఇదే విభాగంలో పోటీపడ్డ భారత మరో త్రోయర్ రోహిత్ యాదవ్ 80.42 మీటర్ల దూరాన్ని నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం తుదిపోరు జరుగనుంది. మరోవైపు ట్రిపుల్ జంప్లో భారత అథ్లెట్ ఎల్డోస్ పాల్ ఫైనల్కు చేరాడు. తద్వారా ట్రిపుల్ జంప్లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. వీసా ఇబ్బందుల కారణంగా ఆలస్యంగా అమెరికాలో అడుగుపెట్టిన పాల్ క్వాలిఫయింగ్ రౌండ్లో 16.68 మీటర్ల దూరం గెంతి ఈ ఘనత సాధించాడు.