యావత్ భారతావని ఆశలు మోస్తూ.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ బరిలో దిగిన నీరజ్చోప్రా.. అంచనాలు అందుకుంటూ రజత పతకంతో మెరిశాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి దేశాన్ని తనవైపు తిప్పుకున్న నీరజ్.. అంతకుమించిన పోటీ ఎదురైన ఈ మెగాటోర్నీలో రెండో స్థానంలో నిలిచాడు. తొలి మూడు ప్రయత్నాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ హర్యానా బుల్లోడు.. నాలుగోసారి బరిసెను 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు. వరల్డ్ అథ్లెటిక్స్లో భారత్కు ఇది తొలి రజతం కాగా.. ఓవరాల్గా రెండో పతకం!
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం నెగ్గడం ఆనందంగా ఉంది. తొలి మూడు త్రోల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నా.. కానీ నాలుగో ప్రయత్నంలో బరిసెను విసరడంలో విజయవంతమయ్యా. ఈ మెగాటోర్నీలో దేశం తరఫున రజతం నెగ్గిన తొలి అథ్లెట్గా నిలువడం సంతోషంగా ఉంది. ఒలింపిక్స్తో పోల్చుకుంటే ఇక్కడే ఎక్కువ పోటీ ఎదురైంది. ఇక్కడి రికార్డులు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. 19 ఏండ్ల తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్లో దేశానికి పతకం అందించినందుకు గర్వపడుతున్నా. చివరి రెండు ప్రయత్నాల్లో నా తొడ కండరాలు పట్టేసినట్లనిపించింది. 2023లో బుడాపెస్ట్ వేదికగా జరుగనున్న చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గేందుకు ప్రయత్నిస్తా. వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
-నీరజ్ చోప్రా
యుజిన్ (అమెరికా): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. విశ్వవేదికపై మరోసారి మెరిశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకున్న నీరజ్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ మెగాటోర్నీలో భారత్కు ఇదే తొలి రజతత కాగా.. ఓవరాల్గా ఇది రెండో మెడల్. 2003 పారిస్ క్రీడల్లో మహిళల లాంగ్జంప్లో అంజూ బాబి జార్జ్ కాంస్యం నెగ్గిన 19 ఏండ్ల తర్వాత నీరజ్.. దేశానికి రెండో పతకం అందించాడు. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ బరిసెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తొలి మూడు ప్రయత్నాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నీరజ్ నాలుగో సారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్ల దూరం బరిసెను విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్న నీరజ్.. ఈసారి అంతకు అర మీటర్ దూరం ఎక్కువ విసిరినా.. రజతానికే పరిమితం కావాల్సి వచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (90.54 మీ., గ్రెనెడా) స్వర్ణం చేజిక్కించుకోగా.. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ (88.09 మీ.) కాంస్యం గెలుచుకున్నాడు. భారత అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు అడిల్లే సుమరివాలా చేతుల మీదుగా నీరజ్ పతకం అందుకోగా.. ఇదే విభాగంలో పోటీ పడ్డ మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ (78.72 మీ.) పదోస్థానంలో నిలిచాడు.
రజతమే బంగారమాయే..
క్వాలిఫయింగ్ రౌండ్లో ఒకే ఒక్క ప్రయత్నంలో బరిసెను 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్.. ఫైనల్లో తొలి మూడు ప్రయత్నాల్లో పెద్దగా ఆకట్టుకోలేక నాలుగో స్థానంలో కనిపించాడు. ఈ దశలో నాలుగో ప్రయత్నంలో బరిసెను అల్లంత దూరం విసిరిన నీరజ్ రెండో స్థానానికి చేరాడు. ఆ తర్వాత మిగిలిన రెండు ప్రయత్నాలు ఫౌల్ కావడంతో నీరజ్ రజతంతో పోటీని ముగించాడు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్నాడు.
ఈ మెగాటోర్నీలో భారత్ ఈసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. వేర్వేరు విభాగాల్లో ఐదుగురు భారత అథ్లెట్లు ఫైనల్కు అర్హత సాధించగా.. అందులో నుంచి నీరజ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ట్రిపుల్ జంప్ ఫైనల్ బరిలోకి దిగిన ఎల్డస్ పాల్ తొమ్మిదో స్థానంలో నిలువగా.. 4×400 మీటర్ల పరుగులో అనస్, అజ్మల్, నాగనాథన్, రాజేశ్తో కూడిన భారత జట్టు 12వ ప్లేస్తో సరిపెట్టుకుంది.టోక్యో ఒలింపిక్స్లో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్న నీరజ్చోప్రా.. తాజా టోర్నీలో 88.13 మీటర్ల ప్రదర్శన నమోదు చేసుకున్నా రజతానికే పరిమితం కావాల్సి వచ్చింది.
1 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు ఇదే తొలి రజతం. 2003లో అంజూ బాబి జార్జ్ మహిళల లాంగ్జంప్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత అథ్లెట్ ఈ టోర్నీలో మెడల్ నెగ్గడం 19 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి.
నీరజ్ చోప్రా అవార్డుల పరంపర కొనసాగుతున్నది. ప్రంపచ అథ్లెటిక్స్లో రజతం నెగ్గిన నీరజ్కు అభినందనలు. దేశాన్ని గర్వపడేలా చేసిన నీరజ్ నిజమైన చాంపియన్.
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
అత్యంత విశిష్టమైన అథ్లెట్లలో ఒకరైన నీరజ్ గొప్ప విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్షిప్లో చారిత్రాత్మక రజతం సాధించిన నీరజ్కు అభినందనలు. భారత క్రీడరంగంలో ఇదో ప్రత్యేకమైన క్షణం. మున్ముందు నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
-నరేంద్ర మోదీ, ప్రధాని