టోక్యో: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందేళ్ల కల. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మెడల్ గెలవాలని స్వతంత్ర భారతావని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj ChopraNeeraj Chopra ) చేసింది అదే. 23 ఏళ్ల కుర్రాడు.. 136 కోట్ల మంది వందేళ్ల కలను సాకరం చేశాడు. అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి మెడలే కాదు ఏకంగా గోల్డ్నే అందించాడు ఈ హీరో. ఒలింపిక్స్లో ఈసారి అథ్లెటిక్స్ మెడల్ కరవు తీరుస్తాడని నీరజ్ చోప్రాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నా.. ఇలా గోల్డ్ సాధిస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. కానీ ఆ ఊహించని అద్భుతాన్నే చేసి చూపించాడు నీరజ్ చోప్రా.
ఐదేళ్ల కిందటే బీజం పడింది
నీరజ్ 2016లో ఐఏఏఎఫ్ అండర్-20 ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో టైటిల్ గెలిచిన తొలి ఇండియన్గా నిలిచాడు. అప్పుడే ఇండియాకు అథ్లెటిక్స్లో ఓ బంగారం దొరికాడు. ఆ బంగారమే ఇప్పుడు టోక్యోలో మరింత మెరిసింది. 2016లో ఆ విజయం తర్వాత నీరజ్ మళ్లీ వెనుదిరిగి చూసింది లేదు. 2017లో ఏషియన్ చాంపియన్షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆ తర్వాత ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2019లో భుజం గాయంతో వరల్డ్ చాంపియన్షిప్స్కు దూరమయ్యాడు. గతేడాది పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగిన నీరజ్.. ఏసీఎన్డబ్ల్యూ లీగ్ మీట్లో 87.86 మీటర్ల దూరం విసిరి.. ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు.
ఈ ఏడాది ఇండియాలో రెండు దేశవాళీ టోర్నీలు గెలిచాడు. ఫెడరేషన్ కప్, ఇండియన్ గ్రాండ్ ప్రి 3లలో విజేతగా నిలిచాడు. ఈ ఇండియన్ గ్రాండ్ ప్రి 3లోనే తన వ్యక్తిగత బెస్ట్ 88.07 మీటర్ల దూరం విసిరాడు. ప్రస్తుతం ఇదే నేషనల్ రికార్డు కావడం విశేషం.
ఫేవరెట్కే షాకిచ్చి..
ఈసారి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే జర్మనీకి చెందిన జోహన్నెస్ వెటర్ గోల్డ మెడల్ ఫేవరెట్ అని చాలా మంది అంచనా వేశారు. కానీ క్వాలిఫికేషన్ రౌండ్లోనే అతన్ని వెనక్కి నెట్టిన నీరజ్చోప్రా.. ఫైనల్లో అయితే ఈ ఫేవరెట్ కంటే చాలా మెరుగైన దూరం జావెలిన్ విసిరాడు. వెటర్ కనీసం బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేకపోయాడు. నిజానికి ఇతని వ్యక్తిగత బెస్ట్ 97.76 మీటర్లు అయినా.. ఫైనల్లో దారుణంగా విఫలమయ్యాడు.