జ్యూరిచ్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్త్రోలో తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతూ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ 88.44 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడాడు. తద్వారా డైమండ్ లీగ్ ఫైనల్లో టైటిల్ దక్కించుకున్న తొలి భారత అథ్లెట్గా చోప్రా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో చోప్రా కెరీర్లో నాలుగో అత్యుత్తమ ప్రదర్శన(88.44మీ) కనబరిచాడు. ఈ క్రమంలో వరుసగా 88.00మీ, 86.11మీ, 87.00మీ, 83.60మీ బరిసెను విసిరి తన సత్తా ఏంటో చూపించాడు.
జాకబ్ వాద్లెచ్(86.94మీ), జులియన్ వెబెర్(83.73మీ) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. విజేతగా నిలిచిన నీరజ్ ట్రోఫీతో పాటు రూ.23.89 లక్షల ప్రైజ్మనీ దక్కించుకున్నాడు. పోటీలు ముగిసిన తర్వాత చోప్రా మాట్లాడుతూ ‘జాకబ్తో దీటైన పోటీ ఎదుర్కొన్నాను. అతడు చాలా బాగా త్రో చేశాడు. నా వరకు 90మీటర్ల మార్క్ లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ రెండు మీటర్ల తేడాతో ట్రోఫీ దక్కించుకున్నాను. నా కెరీర్లో ఇది చిరస్మరణీయ విజయం. తల్లిదండ్రుల సమక్షంలో టైటిల్ అందుకోవడం మరిచిపోలేని అనుభూతి’ అని అన్నాడు. మూడు మేజర్ ఈవెంట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ వచ్చే ఏడాది బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీకి అర్హత సాధించాడు.