భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడేళ్లలో కొత్త కెప్టెన్ అవసరం ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో ఎంచుకోవడానికి ఐపీఎల్ మంచి వేదిక అని అభిప్రాయపడ్డాడు.
గతేడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తప్పించింది. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్సీని కూడా కోహ్లీ వదిలేశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టీమిండియా పగ్గాలు రోహిత్ శర్మకు దక్కాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు కెప్టెన్ కోసం వెతకాల్సిన అవసరం ఉందన్న రవిశాస్త్రి.. ‘‘రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లను చాల జాగ్రత్తగా గమనిస్తాను. అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ తన జట్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో కూడా చూస్తాను. వీళ్లతోపాటు హార్దిక్ పాండ్యాను కూడా గమనిస్తా. దీనికి సింపుల్ కారణం ఏంటంటే.. కెప్టెన్సీ వల్ల వచ్చిన ఉత్సాహంతో అతను విజృంభించి ఆడతాడేమోనని అంతే’’ అని చెప్పాడు.
రోహిత్ శర్మ హయాంలో చాలా మంది కుర్రాళ్లకు టీమిండియా అవకాశాలు దక్కిన సంగతి తెలిసిందే. వీళ్లంతా ఐపీఎల్లో తమ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారో చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రవిశాస్త్రి పేర్కొన్నాడు.