BCCI | బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఏమీ సత్రం కాదని, అందులో ఎవరిని పడితే వారిని చేర్చుకుని శిక్షణ ఇవ్వబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న క్రికెటర్లు, దేశవాళీతో పాటు స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించిన క్రికెటర్లు తప్ప మిగతావారికి అందులో శిక్షణ కార్యక్రమాల వంటివి ఏమీ ఉండవని తేల్చి చెప్పింది. ఇటీవల కాలంలో ఎన్సీఏలో అడ్మిషన్ల కొరకు తమను సంప్రదించాలని సోషల్ మీడియాతో పాటు బహిరంగ ప్రదేశాలలో యాడ్స్ ప్రత్యక్షమవుతున్న వేళ బీసీసీఐ స్పందించింది.
‘ఎన్సీఏలో శిక్షణతో పాటు గాయం నుంచి రికవరీ అయ్యే క్రికెటర్లు అక్కడ ఉన్న వసతులను వినియోగించుకున్నందుకు గాను బీసీసీఐ వారి నుంచి ఎలాంటి నగదును వసూలుచేయదు. ఎన్సీఏ అనేది మెరిట్ ఆధారిత ప్రక్రియ. బీసీసీఐ కాంట్రాక్టు కలిగిన ఆటగాళ్లు, కొంతమంది టార్గెటెడ్ ప్లేయర్స్, స్టేట్ అసోసియేషన్స్ ప్రతిపాదించే క్రికెటర్లకు మాత్రమే అందులో చోటు ఉంటుంది. అంతే తప్ప ఎవరికీ పడితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోవడానికి గానీ ఏజెన్సీలు, కోచింగ్ సెంటర్స్కు గానీ అందులో ఎంట్రీ లేదు..’ అని క్లారిటీ ఇచ్చింది.
అంతేగాక ఎన్సీఏలో జాయిన్ చేయిస్తామని, అక్కడ శిక్షణ ఇప్పిస్తామని సాగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బీసీసీఐ తెలిపింది. అదంతా ఫేక్ అని, వారి ట్రాప్లో పడొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటివి ఎవరి దృష్టికైనా వస్తే సంబంధిత స్టేట్ క్రికెట్ అసోసియేషన్ను సంప్రదించాలని ఒక ప్రకటనలో సూచించింది.
భారత క్రికెట్ జట్టుకు ఆడే క్రికెటర్లతో పాటు స్టేట్ అసోసియేషన్కు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు, అండర్ – 19 టీమ్ మెంబర్స్ గాయాలైనా, ఫిట్నెస్ సమస్యలు ఉన్నా నిత్యం ఎన్సీఏలో ప్రత్యక్షమవడం అందరికీ తెలిసిందే. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో పాటు దీపక్ చాహర్ వంటి క్రికెటర్లు నిత్యం గాయాలతో ఇక్కడి వస్తూ పోతూ ఉంటారు. సుమారు ఏడాదికాలంగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ఎన్సీఏనే ఇళ్లు అయింది.