న్యూఢిల్లీ: భుజానికి గాయమై జట్టుకు దూరమైన భారత యువ బ్యాట్స్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ మేరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అతడికి క్లియరెన్స్ ఇచ్చింది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో శ్రేయస్కు నిర్వహించిన మెడికల్, ఫిట్నెస్ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. దీంతో అయ్యర్ మళ్లీ మైదానంలోకి దిగడానికి అర్హత పొందినట్టు ఎన్సీఏ తెలిపింది. ఎన్సీఏ తాజా నిర్ణయంతో శ్రేయస్.. త్వరలో దుబాయ్ వేదికగా జరుగనున్న ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ భుజానికి తీవ్ర గాయం కాగా అతడికి యూకేలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.