హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూలై 2 నుంచి 5వ తేదీ వరకు జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్, సాట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన స్విమ్మర్లు పోటీపడబోతున్నారు. ఇందులో ఒలింపిక్స్లో పాల్గొన్న శ్రీహరి నటరాజన్, మనా పటేల్, సాజన్ ప్రకాశ్ బరిలోకి దిగుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటీవలే రాష్ట్రంలో సీఎం కప్ టోర్నీని ఘనంగా నిర్వహించాం. దేశానికి ఆణిముత్యాల్లాంటి ప్లేయర్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే ప్రతీ చోట క్రీడా ప్రాంగణాలు నెలకొల్పాం. దేశానికి వన్నె తెస్తున్న ప్లేయర్లకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి ఉమేశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.