జూబ్లీహిల్స్/ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా జాతీయ పవర్లిఫ్టింగ్ టోర్నీకి మంగళవారం తెరలేచింది. పోటీలను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 10 వరకు జరిగే టోర్నీలో 24 రాష్ట్రాల నుంచి 735 మంది లిఫ్టర్లు పోటీపడుతున్నారు. జూనియర్, సబ్జూనియర్, మాస్టర్స్ మూడు విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ‘ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోక్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
ప్రపంచస్థాయి టోర్నీల్లో సత్తాచాటిన వారికి ప్రభుత్వం సముచిత రీతిలో ప్రోత్సాహం అందిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా మరింత మంది ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ రాజేశ్ తివారీ, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసఫ్, ట్రెజరర్ సతీష్, తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ బుచ్చిబాబుగౌడ్, అధ్యక్షుడు శంకర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.