హైదరాబాద్ : ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ -2021 పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ -2021 బ్రోచర్ను రాష్ట్రీ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ దేవీరెడ్డి సుధీర్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిఫ్ పోటీలు హైదరాబాద్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చాంపియన్షిప్లో 26 రాష్ట్రాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్, పుట్ బాల్ లాంటి అనేక క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని, నగదు పురస్కారాలను అందిస్తుందన్నారు.
క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపొందిస్తున్ఆనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. పవర్ లిప్టింగ్లో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రాజశ్రీ, శ్రీనాధ్, సాయి లలీత్, రాజశేఖర్ లాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పెడరేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నిర్వాహకులు రంగేశ్వరి శ్రీనివాస్, యు శ్రీనివాస్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.