హిమాయత్నగర్: హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ మార్షల్ఆర్ట్స్ చాంపియన్షిప్ జరుగబోతున్నది. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీకి సంబంధించిన వివరాలను వోవీనం అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు విష్ణు సహాయ్ మంగళవారం మీడియాకు వివరించారు.
ఈ టోర్నీలో 24 రాష్ర్టాల నుంచి 600 మంది ప్లేయర్లు, 70 మంది అధికారులు పోటీపడుతున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన ప్లేయర్లను నవంబర్, డిసెంబర్లో జరిగే 7వ ప్రపంచ వోవీనం చాంపియన్షిప్ కోసం ఎంపిక చేస్తామని వివరించారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవితను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శంకర్ మహాబలే, ఉజ్వల్ వాఘ్మరే పాల్గొన్నారు.