Nasser Hussain : సుదీర్ఘ ఫార్మాట్లో ‘బజ్ బాల్'(Baz Ball) ఆటతో కొత్త ఒరవడి సృష్టించిన ఇంగ్లండ్ (England) జట్టు భారత పర్యటనలో బొక్కబోర్లాపడింది. దూకుడే మంత్రగా ప్రత్యర్థుల పని పట్టిన బెన్ స్టోక్స్ సేన ఉప్పల్ టెస్టులో బోణీ కొట్టినా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. రాంచీ (Ranchi)లో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ దారుణ ఓటమి అనంతరం భారత్లో బజ్ బాజ్ తుస్సుమందని మాజీలంతా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా స్టోక్స్ సేన సిరీస్ ఓటమిపై ఆ దేశ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్(Nasser Hussain) స్పందించాడు.
భారత్ పర్యటనలో బజ్ బాల్కు పెద్ద పరీక్షే ఎదురుకానుందని ముందే ఇంగ్లండ్ను హెచ్చరించిన రాంచీలో నాలుగో రోజు కాదు మూడో రోజే ఇంగ్లండ్ జట్టు ఓడిపోయిందని అతడు అన్నాడు. ‘రాంచీ టెస్టులో ఇంగ్లండ్ మూడో రోజునే మ్యాచ్ను కోల్పోయింది. భారత్ చాలా గొప్పగా ఆడింది. సిరీస్ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. స్టార్ ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లు అదరగొట్టారు.
ఒకవేళ రాచీలో ఇంగ్లండ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 46 కంటే మరో 100 పరుగులు లభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ సొంత గడ్డపై టీమిండియాకు గొప్ప రికార్డు ఉంది. అందుకని భారత్ చేతిలో ఓడిపోవడం అవమానకరం కాదు. ఇలాంటి టెస్టు సిరీస్లో మనం ఎక్కడ పొరపాట్లు చేశాం అనేది విశ్లేషించుకోవాలి’ అని హుస్సేన్ తెలిపాడు.
వైజాగ్, రాజ్కోట్లో ఇంగ్లండ్ భరతం పట్టిన టీమిండియా రాంచీలోనూ రఫ్ఫాడించింది. కుర్రాళ్లు ధ్రువ్ జురెల్(90, 39 నాటౌట్), యశస్వీ జైస్వాల్(73), శుభ్మన్ గిల్(55 నాటౌట్)లు అద్భుతంగా రాణించారు. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడారు. ఇక బౌలింగ్ యూనిట్లో కుల్దీప్ యాదవ్, అశ్విన్లు ఇంగ్లండ్ను తిప్పేశారు. అయితే.. మూడో రోజు పట్టుబిగించిన రోహిత్ సేన అనూహ్యంగా నాలుగో రోజు తడబడింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ల ధాటికి 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(39 నాటౌట్), శుభ్మన్ గిల్(55 నాటౌట్)తో కలిసి ఆచితూచి ఆడాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్కు 72 పరుగులు జోడించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు.