Rohit Rao | అతడికి నాన్నే స్ఫూర్తి. ఆయన అడుగుజాడలే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో తండ్రి దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తే..ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పర్వతారోహణతో శిఖర స్థాయికి తీసుకెళ్లేందుకు అలుపెరుగకుండా శ్రమిస్తున్నాడు. ఆ తండ్రి అర్జున అవార్డు గ్రహీత, పారా అథ్లెట్ మాదాసు శ్రీనివాసరావు అయితే ఆయన కొడుకు రోహిత్రావు. సరిగ్గా ఆరేండ్ల క్రితం కేదార్కాంత పర్వతంతో మొదలైన రోహిత్ అధిరోహణం ఇటీవలి కిలిమంజారోతో మరో స్థాయికి చేరింది. ఈ ఆరేండ్ల కాలంలో తొమ్మిది పర్వతాలు ఎక్కిన రోహిత్.. ఎవరెస్ట్ లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటే దేశ ఖ్యాతిని హిమాలయాల్లో సగర్వంగా రెపరెపలాడించేందుకు సిద్ధంగా ఉన్నా అంటున్న రోహిత్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ
నా తండ్రి మాదాసు శ్రీనివాసరావు ప్రముఖ పారా అథ్లెట్. వైకల్యాన్ని అధిగమిస్తూ అనితర సాధ్యమైన విజయాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చారు. అవయవాలు సరిగ్గా లేకపోయినా..బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటిన ఆయనే నాకు స్ఫూర్తి. వాస్తవానికి చిన్నతనంలో క్రీడల పట్ల నాకు ఆసక్తి లేదు. నాన్న శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించినా అటువైపు మొగ్గలేదు. అయితే మంచుతో కూడిన పర్వతాలు అంటే ఊహ తెలిసిన వయసు నుంచి బాగా ఇష్టం. వాటి గురించి తెలుసుకోవాలని కుతుహలం ఉండేది. అలా పర్వతారోహణపై ఇష్టం ఏర్పడింది.
సరిగ్గా ఆరేండ్ల క్రితం పర్వతారోహణ వైపు అడుగులు పడ్డాయి. నాన్నను ఆదర్శంగా తీసుకుంటూ ప్రమాదకర క్రీడగా పేరొందిన పర్వతారోహణను ఎంచుకున్నాను. తొలుత శిఖరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను. సరైన రీతిలో శిక్షణ లేకపోయినా ఏదైనా సాధించాలన్న కసితో ముందుకు నడిచాను. అందుకు నాన్న మంచి తోడ్పాటు అందించారు. మొదటగా 2018 డిసెంబర్లో హిమాలయ పర్వత సానువుల్లోని కేదార్కాంత (3,810మీ) పర్వతాన్ని ఎక్కాను. అక్కణ్నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత క్రమంలో పంగర్చుల్లా (4,590మీ), స్టాక్ కాంగ్రీ 4,980మీ), బ్రహ్మతల్ (3,734మీ), దైరా బుగ్యాల్ (3,639మీ), జో జాంగో (6,240మీ), ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364మీ), కాంగ్ యాస్టె (6,250మీ), కిలిమంజారో (5,985 మీ) ఎక్కాను. ప్రతీ ఏడాది కచ్చితంగా ఏదో పర్వతాన్ని ఎక్కాలన్న లక్ష్యాన్ని ఎంచుకున్నాను. అందుకు తగ్గట్లు ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నాను.
వాస్తవానికి చిన్నతనంలో మా నాన్న బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్లో శిక్షణ ఇప్పిద్దామనుకున్నారు. కానీ నాకు పెద్ద ఇష్టముండేది కాదు. తల్లిదండ్రులు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టినప్పుడల్లా నేను హిమాలయాలకు పారిపోతానని వారిని బెదిరించేవాన్ని. అలా పర్వతాలపై మొదలైన నా ప్రస్థానం ఇక్కడి వరకు చేరింది. ఈ ఆరేండ్ల వ్యవధిలో ఇప్పటికి తొమ్మిది పర్వతాలు అధిరోహించాను. ఇంకా ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్తో పాటు మిగతా వాటిని ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాను. మిగతా క్రీడలతో పోలిస్తే.. పర్వతారోహణ అనేది సాహస క్రీడ. ఏ మాత్రం అలక్షం ఆవరించినా..ప్రాణాలకే ప్రమాదం. ఓవైపు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడం నాన్న నుంచి నేర్చుకున్నదే. ఆయన గర్వపడే విధంగా ఏదో ఒకటి చేయాలన్నదే నా లక్ష్యం.
2018 నుంచి ప్రతీ సంవత్సరం ఒక పర్వతం ఎక్కుతూ వస్తున్నాను. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 2020లో సాధ్యపడలేదు. మిగతా సంవత్సరాల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. ఇటీవలి టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఇందుకు ప్రముఖ అధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ఆర్థిక సాయం అందించారు. 2026లో ఎవరెస్ట్పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందుకోసం 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే..రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా సాధిస్తానన్న గట్టి నమ్మకం నాకుంది.
మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి స్వగ్రామం. అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు మా నాన్న. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. 2021లో క్యాన్సర్తో నాన్న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పర్వతారోహణాన్ని కెరీర్గా ఎంచుకున్నాను. నాన్న పేరు నిలబెట్టేలా ముందుకెళ్లాలన్నదే నా లక్ష్యం.