ఇటాలియన్ ఓపెన్లో మట్టికోర్టు రారాజు రఫేల్ నాదల్ 12వ సారి టైటిల్ పోరుకు చేరాడు. తనకు అచ్చొచ్చిన వేదికపై సెమీస్లో సునాయాస విజయంతో ఫైనల్ ఫైట్లో అడుగుపెట్టాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ కోసం స్వియాటెక్, ప్లిస్కోవా పోటీ పడనున్నారు. కాగా ఇటాలియన్ టోర్నీలో అమెరికా యువ సంచలనాలు రెలీ ఓప్లెకా, కోకో గాఫ్ పోరాటం ముగిసింది.
రోమ్: మట్టికోర్టు టోర్నీ ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ వీరుడు రఫేల్ నాదల్ అడుగుపెట్టాడు. తిరుగులేని ఆటతో మరోసారి మైమరిపించాడు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో 20 గ్రాండ్స్లామ్ టైటిళ్ల వీరుడు నాదల్ 6-4, 6-4 తేడాతో అమెరికన్ రెలీ ఓప్లెకాపై అలవోకగా గెలిచి 12వ సారి ఇటాలియన్ ఓపెన్ ఫైనల్ చేరాడు. గంటా 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ ఆసాంతం నాదల్ ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండు సెట్లలో చెరో సారి ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి సునాయాసంగా విజయం సాధించించాడు. ఇప్పటికే 9సార్లు ఇటాలియన్ చాంపియన్గా నిలిచిన నాదల్.. పదో టైటిల్ సాధించి మట్టికోర్టులో ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. కాగా మరో సెమీస్లో ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్.. సొనెగో (ఇటలీ)తో పోరాడుతున్నాడు. ఈ మ్యాచ్లో గెలిచిన ప్లేయర్తో నాదల్తో టైటిల్ కోసం ఆదివారం తలపడనున్నాడు.
ఒకే రోజు రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, పొలాండ్ భామ ఇగా స్వియాటెక్ ఇటాలియన్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీస్లో స్వియాటెక్ 7-6 (7/3), 6-3 తేడాతో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ను చిత్తుచేసి టైటిల్ పోరుకు చేరింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్స్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)ను 6-2, 7-5 తేడాతో ఇగా మట్టికరిపించింది. మరో సెమీస్లో తొమ్మిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 3-6, 6-2 తేడాతో పెట్రా మార్టిక్ (క్రొయేషియా) పై గెలిచి, స్వియాటెక్తో ఆదివారం టైటిల్ పోరుకు సిద్ధమైంది.