ఐపీఎల్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత రెండు టైటిళ్లు నెగ్గిన జట్టుగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం తీరుపై పశ్చిమబెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేకేఆర్ లో తమ రాష్ట్ర క్రికెటర్లకు చోటులేదని.. ఆ జట్టు ఇక్కడి క్రికెటర్లను ఎందుకు ప్రోత్సహించడం లేదని జట్టు యజమానిగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను ప్రశ్నించాడు.
గతంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, మహ్మద్ షమీ, లక్ష్మీ రతన్ శుక్లా, వృద్దిమాన్ సాహా వంటి పేరున్న ఆటగాళ్లు కేకేఆర్ తరఫున ఆడారు. కానీ కొన్ని సీజన్లుగా కేకేఆర్ లో బెంగాల్ ప్లేయర్లకు పెద్దగా చోటు దక్కడం లేదు. ఇదే పరిస్థితిపై తాజాగా మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘నేను కూడా మార్పు కోరుకుంటున్నాను. బెంగాల్ లో చాలా మంది క్రికెటర్లకు ఐపీఎల్ ఆడే సత్తా ఉంది. నా సూటి ప్రశ్న ఏంటంటే.. బెంగాల్ ఆటగాళ్లు ఇతర జట్ల తరఫున ఆడుతూ అదరగొడుతున్నప్పుడు వాళ్లు ఇక్కడ ఎందుకు ఆడటం లేదు..?
ఈ ప్రశ్న కేకేఆర్ యాజమన్యానికి చాలాకాలంగా ఎదురవుతూనే ఉన్నది. కానీ కేకేఆర్ మేనేజ్మెంట్ మాత్రం దీనిమీద చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నది. ఇప్పటివరకు దాని మీద వాళ్లు బహిరంగంగా మాట్లాడలేదు..’ అని అన్నాడు. 2012లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కేకేఆర్ జట్టులో మనోజ్ తివారి సభ్యుడు.
స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించడం వల్ల ఇక్కడి యువత కూడా వారి నుంచి స్ఫూర్తి పొందుతారని తివారి చెప్పాడు. ‘స్థానిక ఆటగాళ్లు స్టేడియాలకు వచ్చిన ఇక్కడి పిల్లలకు స్పూర్తిగా నిలుస్తారు. అదీగాక ఇక్కడి ఆటగాళ్లతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. కానీ వాళ్లు ఆ అనుభూతిని ఎప్పుడు పొందుతారు..? నేను ఈ విషయం గురించి షారుఖ్ ఖాన్ తో మాట్లాడమని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరతాను. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం..’ అని తివారి తెలిపాడు.