Mumbai Indians | ఐపీఎల్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి ఎదుర్కొని ముఖం వాచిపోయిన ముంబై..సొంతగడ్డపై పరువు దక్కించుకుంది. ఆదివారం డబుల్ హెడర్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరులో ముంబై సమిష్టి ప్రదర్శనతో బోణీ కొట్టింది. ఓపెనర్లు రోహిత్, ఇషాన్ అదిరిపోయే ఆరంభమివ్వగా, ఆఖర్లో రొమారియో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన షెఫర్డ్..నొకియా ఆఖరి ఓవర్లో 4, 6, 6, 6, 4, 6తో ఏకంగా 32 పరుగులు కొల్లగొట్టాడు. లక్ష్యఛేదనలో పృథ్వీషా, ట్రిస్టన్ స్టబ్స్ పోరాటంఢిల్లీకి ఫలితమివ్వలేదు.
ముంబై: ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. కెప్టెన్సీ మార్పునకు తోడు వరుస వైఫల్యాలతో హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ముంబై లీగ్లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 234/5 స్కోరు చేసింది. రోహిత్శర్మ(49), టిమ్ డేవిడ్(45), ఇషాన్ కిషన్(42), రొమారియో షెఫర్డ్(10 బంతుల్లో 39, 3ఫోర్లు, 4 సిక్స్లు)రాణించారు. అక్షర్పటేల్, నొకియా రెండేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో షెఫర్డ్ కండ్లు చెదిరే రీతిలో బౌండరీలతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. లక్ష్యఛేదనలో ఢిల్లీ 205/8 స్కోరుకు పరిమితమైంది. స్టబ్స్(25 బంతుల్లో 71 నాటౌట్, 3ఫోర్లు, 7 సిక్స్లు), పృథ్వీషా(40 బంతుల్లో 66, 8ఫోర్లు, 3సిక్స్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్(1), వార్నర్ (10), అక్షర్పటేల్ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. కొట్జె (4/34)నాలుగు వికెట్లతో విజృంభించగా, బుమ్రా (2/22)ఆకట్టుకున్నాడు. సుడిగాలి ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకమైన షెఫర్డ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
షెఫర్డ్ నాటు కొట్టుడు:
ముంబైకి ఓపెనర్లు రోహిత్శర్మ, ఇషాన్కిషన్ మెరుగైన శుభారంభాన్ని అందించారు. గత మ్యాచ్లో డకౌట్ అయిన రోహిత్..ఈసారి సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే రోహిత్ బౌండరీల దూకుడు కనబరిచాడు. మరో ఎండ్లో ఇషాన్ కూడా చెలరేగడంతో ముంబైకి పరుగుల రాక సులువైంది. పంత్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా రోహిత్, ఇషాన్ జోడీ అదే దూకుడు కనబర్చడంతో ముంబై పవర్ప్లే ముగిసే సరికి 75 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ జోరు అందుకుంటున్న తరుణంలో అక్షర్ బౌలింగ్లో రోహిత్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. సూర్యకుమార్యాద్(0) ఇలా వచ్చి అలా వెళ్లగా, హార్దిక్ పాండ్యా(39) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తిలక్వర్మ(6) మరోమారు నిరాశపరచగా, చివర్లో టిమ్ డేవిడ్తో కలిసి షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఆఖరి ఓవర్కు దిగిన నోకియాను లక్ష్యంగా చేసుకుంటూ వరుస బంతుల్లో నాలుగు భారీ సిక్స్లు, రెండు ఫోర్లతో స్కోరుబోర్డుకు 32 పరుగులు జతచేశాడు. దీంతో అప్పటి వరకు 202 పరుగులతో ముంబై షెఫర్డ్ దెబ్బ కు 234 స్కోరు అందుకుంది.
స్టబ్స్, షా పోరాడినా:
లక్ష్యఛేదనలో ఢిల్లీ..ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీషా.. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ పోరెల్(41)తో కలిసి రెండో వికెట్కు షా 88 పరుగులు జోడించాడు. పంత్ తొందరగా ఔట్ కాగా స్టబ్స్ ఒంటరిపోరాటం కనబరిచాడు. సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో స్టబ్స్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 234/5(రోహిత్ 49, డేవిడ్ 45, అక్షర్పటేల్ 2/35, నోకియా 2/65), ఢిల్లీ: 20 ఓవర్లలో 205/8(స్టబ్స్ 71 నాటౌట్, పృథ్వీషా 66, కొట్జె 4/34, బుమ్రా 2/22)