Surya Kumar yadav | ఐపీఎల్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ముంబై ఇండియన్స్.. సీజన్ చివరి దశకు వచ్చేసరికి దుమ్మురేపుతున్నది. వరుస విజయాలతో విజృంభిస్తున్న రోహిత్ సేన.. గుజరాత్పై ప్రతీకార విజయాన్ని ఖాతాలో వేసుకుని 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ వాంఖడేలో వీరంగమాడుతూ.. ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేసుకోగా.. ఛేదనలో రషీద్ఖాన్ తన మెరుపు షాట్లతో అభిమానుల్లో జోష్ నింపాడు.
ముంబై: కీలక సమయంలో జూలు విదిల్చిన ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తుకు మరింత చేరువైంది. 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో ముంబై ఏడో విజయం నమోదు చేసుకుంది. గత ఐదు మ్యాచ్ల్లో రోహిత్సేనకు ఇది నాలుగో విజయం కావడం గమనార్హం. శుక్రవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ సీజన్లో ముంబైకిది వరుసగా నాలుగో 200 ప్లస్ స్కోరు కావడం విశేషం. సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. చాన్నాళ్ల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టచ్లో కనిపించాడు. ఇషాన్ కిషన్ (31; 4 ఫోర్లు, ఒక సిక్సర్), విష్ణు వినోద్ (30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
రషీద్ ఖాన్ (32 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) ఎడాపెడా సిక్సర్లతో చెలరేగగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), శుభ్మన్ గిల్ (6), వృద్ధిమాన్ సాహా (2), అభినవ్ మనోహర్ (2), రాహుల్ తెవాటియా (14) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విజయ్ శంకర్ (29; 6 ఫోర్లు) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ 3, చావ్లా, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా శనివారం జరుగనున్న డబుల్ హెడర్లో లక్నోతో హైదరాబాద్, ఢిల్లీతో పంజాబ్ తలపడనున్నాయి.
సూర్యకుమార్ సూపర్ షో..
చిత్ర విచిత్ర షాట్లతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో తొలి సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్లో శుభారంభం దక్కింది. గత ఐదు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ దాటలేకపోయిన సారథి రోహిత్ శర్మ.. గుజరాత్తో పోరులో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్, రోహిత్ ఎడాపెడా షాట్లు కొట్టడంతో పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. అయితే ఈ దశలో స్టార్ స్పిన్నర్ రషీద్ మాయ చేశాడు. ఒకే ఓవర్లో ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించిన రషీద్.. ఆ తర్వాత మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన సూర్య.. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయిన ఈ ముంబైకర్.. మోహిత్ శర్మ వేసిన 18వ ఓవర్లో 4,4,6,4 కొట్టాడు. 19వ ఓవర్లో 6,4,4,తో సెంచరీకి చేరువైన సూర్య.. చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. తాజా సీజన్లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థుల పాలిట కొరుకుడు పడని కొయ్యలా మారిన మహమ్మద్ షమీ (4 ఓవర్లలో 53) బౌలింగ్లో సూర్యకుమార్ స్వేచ్ఛగా పరుగులు రాబట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 218/5 (సూర్యకుమార్ 103 నాటౌట్, ఇషాన్ 31; రషీద్ ఖాన్ 4/30),
గుజరాత్: 20 ఓవర్లలో 191/8 (రషీద్ ఖాన్ 79 నాటౌట్, మిల్లర్ 41; ఆకాశ్ 3/31, పియూష్ చావ్లా 2/36).