అంటిగ్వా: వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్లేయర్ కిరెన్ పొల్లార్డ్ తన ఐపీఎల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశాడు. అయితే, ఆటగాడిగా రిటైర్ అయినా ముంబై ఇండియన్స్తో అతని బంధం కొనసాగనుంది. ఎందుకంటే వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ టీమ్కు బ్యాటింగ్ కోచ్గా పొల్లార్డ్ వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్లో గత 13 సీజన్ల నుంచి తనను ప్రేమగా, గౌరవంగా చూసిన.. తనపై నమ్మకంతో సుదీర్ఘకాలం జట్టులో అవకాశం కల్పించిన ముకేశ్ అంబానీకి, ఆయన సతీమణి నీతా అంబానీకి, వారి కుమారుడు ఆకాశ్ అంబానీకి కిరెన్ పొల్లార్డ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. మొదటిసారి ముకేశ్ అంబానీ కుంటుంబాన్ని కలిసినప్పుడు.. వారు సాధరంగా ఆహ్వానించి, మనమంతా ఒక కుటుంబం అని చెప్పిన విషయాన్ని పొల్లార్డ్ గుర్తుచేసుకున్నారు.
కిరెన్ పొల్లార్డ్ 2010లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి మొత్తం 13 సీజన్లలో 189 మ్యాచ్లు ఆడిన పొల్లార్డ్ 28.67 సగటుతో 3,412 పరుగులు చేశాడు. అందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పార్ట్ టైమ్ బౌలర్గా 69 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే గత సీజన్లో పొల్లార్డ్ పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడి 14.40 సగటుతో కేవలం 144 పరుగులు మాత్రమే చేశాడు. 107.46 స్ట్రైక్ రేట్తో పేలవ ప్రదర్శన చేశాడు. అందులో 25 పరుగులే అతని అత్యుత్తమ స్కోరు కావడం గమనార్హం. అటు బాల్తోనూ పొల్లార్డ్ విఫలమయ్యాడు. 11 మ్యాచ్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు.