ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతున్నది. ఆరంభంలో ఆడిన ఐదు మ్యాచ్లలో ఒకటే విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. తర్వాత ఐదింటిలో ఐదూ గెలిచి 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. మొదట రికెల్టన్, సూర్య మెరుపులతో లక్నో సూపర్ జెయింట్స్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపిన ముంబై.. ఆ తర్వాత బుమ్రా, బౌల్ట్ పేస్తో ప్రత్యర్థిని చిత్తుచేసింది.
Mumbai Indians | ముంబై: బ్యాటింగ్ మెరుపులు, బౌలర్ల జోరుతో ఐపీఎల్-18 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రికెల్టన్ (32 బంతుల్లో 58, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. భారీ ఛేదనలో లక్నో.. 161 పరుగులకే కుప్పకూలింది. అయుశ్ బదోని (35), మిచెల్ మార్ష్ (34) తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు. ముంబై పేసర్లు జస్ప్రిత్ బుమ్రా (4/22), ట్రెంట్ బౌల్ట్ (3/20) లక్నోను దెబ్బతీశారు. బ్యాట్తో (29) పాటు బంతి (2/18)తోనూ రాణించిన విల్ జాక్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారీ ఛేదనలో లక్నో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబాటుకు గురైంది. మూడో ఓవర్లోనే బుమ్రా.. మార్క్మ్ (9)ను ఔట్ చేసి లక్నోను తొలిదెబ్బ కొట్టాడు. వన్ డౌన్లో వచ్చిన పూరన్ (27).. చాహర్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ ఏడో ఓవర్లో బౌలింగ్ మార్పుగా వచ్చిన విల్ జాక్స్.. పూరన్తో పాటు పంత్ (4)నూ పెవిలియన్కు పంపి లక్నోకు డబుల్ షాకులిచ్చాడు. బదోని అండగా మార్ష్ లక్నో ఇన్నింగ్స్ను నిలబెట్టే యత్నం చేశాడు. హార్దిక్ 9వ ఓవర్లో మార్ష్ రెండు బౌండరీలు రాబట్టగా కర్ణ్ శర్మ బౌలింగ్లో బదోని 6, 6, 4 దంచాడు. ఈ జోడీని విడదీయడానికి 12వ ఓవర్లో హార్దిక్.. బౌల్ట్కు బంతినిచ్చాడు. ఈ ఓవర్లో బౌల్ట్ రెండో బంతిని పుల్ షాట్ ఆడబోయిన మార్ష్.. తిలక్ వర్మ చేతికి చిక్కడంతో 46 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 15వ ఓవర్లో మరోసారి బంతినందుకున్న బౌల్ట్.. బదోనిని పెవిలియన్కు పంపాడు. ఇక అక్కడ్నుంచి లక్నో పతనం వేగంగా సాగింది. బుమ్రా 16వ ఓవర్లో మిల్లర్ (24), అబ్దుల్ సమద్ (2), అవేశ్ను బౌల్డ్ చేయడంతో లక్నో ఓటమి ఖరారైంది.
ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్, సూర్య ఆటే హైలైట్. ప్రిన్స్ యాదవ్ రెండో ఓవర్లోనే రికెల్టన్.. 6, 4, 4 బాదాడు. ఆరు నెలల విరామం తర్వాత తొలి టీ20 ఆడిన మయాంక్ యాదవ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్.. రెండు సిక్సర్లు కొట్టి ఊపుమీదే కనిపించాడు. కానీ అతడే వేసిన స్లో షార్ట్ డెలివరీని ఆడబోయి ప్రిన్స్కు క్యాచ్ ఇచ్చాడు. జాక్స్ నెమ్మదిగా ఆడినా రికెల్టన్ జోరు కొనసాగింది. దిగ్వేశ్ ఆరో ఓవర్లో అతడు 6, 4, 6 దంచి 25 బంతుల్లోనే అర్థ సెంచరీని నమోదుచేశాడు. దిగ్వేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అతడు.. బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రికెల్టన్ నిష్క్రమించిన కొద్దిసేపటికే ముంబై.. జాక్స్, తిలక్ (6), హార్దిక్ (5) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. కానీ రికెల్టన్ స్థానంలో వచ్చిన సూర్య మాత్రం లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బిష్ణోయ్ బౌలింగ్లో సిక్సర్తో పరుగుల వేట మొదలుపెట్టిన సూర్య.. అతడే వేసిన 13వ ఓవర్లో 6, 4, 4తో శిక్షించాడు. అవేశ్ 18వ ఓవర్లో సిక్సర్తో ఈ సీజన్లో మూడో అర్ధ శతకాన్ని పూర్తిచేసినా మరుసటి బంతికే నిష్క్రమించాడు. ఆఖర్లో నమన్ (25 నాటౌట్), కార్బిన్ (20) వేగంగా ఆడారు.
ముంబై: 20 ఓవర్లలో 215/7 (రికెల్టన్ 58, సూర్య 54, మయాంక్ 2/40, అవేశ్ 2/42);
లక్నో: 20 ఓవర్లలో 161 ఆలౌట్ (బదోని 35, మార్ష్ 34, బుమ్రా 4/22, బౌల్ట్ 3/20)