చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బోణీ చేసింది.
మంగళవారం చెపాక్ వేదికగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. డెత్ ఓవర్లలో ముంబై కళ్లు చెదిరే బౌలింగ్తో అదరగొట్టింది. కోల్కతా విజయానికి 30 బంతుల్లో 31 రన్స్ చేయాల్సి ఉండగా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఆడుతూ పాడుతూ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోల్కతా చేజేతులా మ్యాచ్ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. అది కూడా 10 పరుగుల తేడాతో!
ఓపెనర్ నితీశ్ రాణా(57) ఒంటరి పోరాటం వృథా అయింది. రాణా ఔటవడంతోనే కోల్కతా అయోమయంలో పడి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. అనవసరంగా భారీ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. ఆరంభంలో శుభ్మన్ గిల్(33) జట్టుకు మంచి పునాదివేశాడు. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. యువ కెరటం రాహుల్ చాహర్(4/27) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా ట్రెంట్ బౌల్ట్(2/27) కళ్లుచెదిరే బంతులేసి నాలుగు పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు సూర్య కుమార్ యాదవ్(56: 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకానికి తోడు రోహిత్ శర్మ(43: 32 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో విజృంభించగా పాట్ కమిన్స్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు.