బెంగళూరు: బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, హార్దిక్ తమోరె శతకాలు బాదడంతో 393 పరుగులు చేసిన ముంబై.. ప్రత్యర్థిని 180 పరుగులకే ఆలౌట్ చేసింది. తుషార్ (3/34), తనుశ్ (3/35), మోహిత్ (3/39) ధాటికి.. ఉత్తరప్రదేశ్ ఆటగాళ్లు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శివమ్ మావి (48) టాప్స్కోరర్. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 133/1తో నిలిచింది. కెప్టెన్ పృథ్వీషా (64) హాఫ్సెంచరీ అనంతరం ఔట్ కాగా.. యశస్వీ జైస్వాల్ (35), అర్మాన్ జాఫర్ (32) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ముంబై ప్రస్తుతం 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. దేశవాళీ ట్రోఫీని ఇప్పటి వరకు 41 సార్లు సొంతం చేసుకున్న ముంబై.. ఈసారి ఫైనల్కు చేరడం దాదాపు ఖాయమైనట్లే!
మంత్రి మనోజ్ పోరాడినా..
బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి (102; 12 ఫోర్లు)తో పాటు షాబాజ్ అహ్మద్ (116; 12 ఫోర్లు) సెంచరీలతో పోరాడినా.. మధ్యప్రదేశ్తో జరుగుతున్న సెమీస్లో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించలేకపోయింది. తొలుత మధ్యప్రదేశ్ 341 పరుగులకు ఆలౌట్ కాగా.. మనోజ్, షాబాజ్ తప్ప మిగిలినవాళ్లంతా విఫలమవడంతో బెంగాల్ మొదటి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ గురువారం ఆట ముగిసే సమయానికి 163/2తో నిలిచింది.