ముంబై : భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) అతని 50వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక బహుమతి అందించనున్నది. ప్రఖ్యాత వాంఖడే స్టేడియం ఆవరణలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంసీఏ సన్నాహాలు చేస్తున్నది. క్రికెట్కు సచిన్ సేవలకు గుర్తుగా ఈ చిన్న బహుమతి అందించనున్నట్టు ఎంసీఏ తెలిపింది.
ఏప్రిల్ 24న 50 పడిలోకి ప్రవేశిస్తున్న సచిన్ క్రికెట్లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా సచిన్ను వరించింది. అటువంటి మేటి ఆటగాడిని సన్మానించుకోవడం తమ అదృష్టమని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలె అన్నారు. మెల్బోర్న్ స్టేడియంలో షేన్ వార్న్ విగ్రహం వలే వాంఖడేలో సచిన్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యేడాది మన దేశంలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సచిన్ వాంఖడేతో పాతికేళ్ల తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఇక్కడే ప్రారంభమైందని, ఈ స్టేడియంతో తనకు విడదీయరాని అనుబంధముందన్నాడు.