ముంబై: 2026 టీ20 వరల్డ్కప్ను ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ సేన 96 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్కప్ టైటిల్ను మూడోసారి చేజిక్కించుకున్న టీమిండియా చరిత్రసృష్టించింది. అయితే 2007లో ఇండియాకు టీ20 వరల్డ్కప్ అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. ఇవాళ తన ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. ప్రధాన కోచ్ గంభీర్తో పాటు బౌలర్ బుమ్రాపై ధోనీ తన మెసేజ్లో ప్రశంసలు కురిపించాడు. గంభీర్ తన కోచింగ్ నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లినట్లు ధోనీ తన సందేశంలో పేర్కొన్నాడు. గంభీర్ తన బృందంతో అసాధారణ ప్రతిభను కనబరిచినట్లు తెలిపాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న జస్ప్రీత్ బుమ్రాను కూడా ధోనీ మెచ్చుకున్నాడు. బుమ్రా ఓ చాంపియన్ బౌలర్ అని తన మెసేజ్లో పేర్కొన్నాడు. బుమ్రా గురించి ఏమీ చెప్పకపోవడమే గొప్ప విషయమన్నాడు. భారత జట్టు అత్యద్భుతంగా రాణించిందని, అహ్మాదాబాద్లో చరిత్ర సృష్టించారని, భారత బృందానికి, సపోర్ట్ స్టాఫ్కు తన మెసేజ్లో ధోనీ కంగ్రాట్స్ తెలిపాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫీని నిలబెట్టుకుంది టీమిండిచా. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్కు ఇది వరుసగా రెండో వరల్డ్ కప్ (2024 తర్వాత) కాగా స్వదేశంలో ఈ ట్రోఫీ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది. ఫైనల్లో సంజూ శాంసన్ (46 బంతుల్లో 89, 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52, 6 ఫోర్లు, 3 సిక్స్లు) విధ్వంసకర మెరుపులతో భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఛేదనలో బుమ్రా (4/15) పేస్ పదునుకు తోడు అక్షర్ పటేల్ (3/27) స్పిన్ మాయతో కివీస్ 19 ఓవర్లలో 159కే కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్ (26 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగిలినవారంతా నిరాశపరిచారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, శాంసన్కు(321 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డులు దక్కాయి.