దుబాయ్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ సందర్భంగా ధోనీయే ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడతానో లేదో అని అతడు అనడం గమనార్హం. అయితే చెన్నై టీమ్తోనే కొనసాగుతానని మాత్రం స్పష్టం చేశాడు. వచ్చే సీజన్లోనూ మీరు నన్ను పసుపు రంగు జెర్సీలోనే చూస్తారు. అయితే సీఎస్కేకు ఆడతానో లేదో మాత్రం తెలియదు. చాలా అనిశ్చిత పరిస్థితులు రాబోతున్నాయి. రెండు కొత్త టీమ్స్ వస్తున్నాయి. రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుందో తెలియదు అని ధోనీ అన్నాడు.
ఈ మధ్యే ఓ వర్చువల్ మీట్లో ఫ్యాన్స్తో మాట్లాడుతూ.. తాను చెన్నైలోనే ఫేర్వెల్ మ్యాచ్ ఆడతానని అతను చెప్పాడు. అయితే అంతలోనే అతడు ప్లేయర్గా తనకిదే చివరి సీజన్ కావచ్చన్న హింట్ ఇవ్వడం విశేషం. ఈ నెలలోనే ఐపీఎల్లో అడుగుపెట్టబోయే రెండు కొత్త టీమ్స్ ఏవో తేలిపోనుంది. ఆ తర్వాత మెగా వేలం జరుగుతుంది. ఒక్కో టీమ్ ఎంత మంది ప్లేయర్స్ను రిటేన్ చేసుకోవచ్చు, రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించుకోవచ్చన్నదానిపై స్పష్టత లేదు.