MS Dhoni Birthday : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni ) 42వ పుట్టిన రోజును ప్రత్యేకంగా చేసుకున్నాడు. రాంచీలోని ఫామ్హౌస్(Ranchi farmhouse)లో ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ దిగ్గజ క్రికెటర్ కేకు కట్ చేశాడు. ఇంతకు ఆ గెస్ట్లు ఎవరంటే..? అతడి పెంపుడు కుక్కలు(Pet Dogs). అవును.. వాటి కళ్లెదురుగానే మహీ కేకు కోశాడు. అనంతరం ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో పోస్ట్ పెట్టాడు. ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికి ధన్యవాదాలు. బర్త్ డేన నేను ఏం చేశానో చూడండి’ అని ఆ వీడియోకు క్యాప్షన్ రాశాడు.
వీడియోలో నాలుగు పెంపుడు కుక్కలు ధోనీ చుట్టూ చేరాయి. అప్పుడు ఈ కూల్ కెప్టెన్ ఒక చిన్న టేబుల్ మీద కేకు పెట్టి కట్ చేశాడు. కొన్ని కేకు ముక్కలను తన పెట్స్కు విసిరేశాడు. ఆ తర్వాత తాను కూడా కేకు రుచి చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ బర్త్ డే వీడియో చూసి .. ‘చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చావు. థాంక్యూ తాలా’ అని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
జార్ఖండ్ డైనమైట్ ధోనీ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ టీమిండియాపై చెరగని ముద్ర వేశాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా ధోనీ చరిత్ర సృష్టించాడు. అతడి సారథ్యంలో భారత జట్టు 2007లో పొట్టి ప్రపంచ కప్(T20 WC 2007), 2011లో వన్డే వరల్డ్ కప్(ODI WC 2011), 2013లో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2013 ) విజేతగా అవతరించింది.
2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో రనౌటైన ధోనీ
అయితే.. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్(Newzealand)పై ఓటమి మహీని ఎంతగానో బాధించింది. ఆ మ్యాచ్లో రనౌట్గా వెనదిరిగిన ధోనీ ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్(IPL)లోనూ తన మార్క్ కెప్టెన్సీతో ఫ్యాన్స్ను అలరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టకు ఏకంగా 5 ట్రోఫీలు సాధించి పెట్టాడు. చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. దాంతో, ఐదు సార్లు ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రికార్డును సమం చేసింది. పదహారో సీజన్తో ఐపీఎల్కు గుడ్ బై చెప్తాడంటూ వచ్చిన వార్తల్ని మహీ తోసిపుచ్చాడు. దాంతో, అతను వచ్చే సీజన్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉందని అనుకుంటున్నారంతా.