దుబాయ్: రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో అభిమానుల కోసం మరిన్ని టిక్కెట్లను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెగాటోర్నీకి ఉన్న విపరీతమైన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇప్పటికే యూఏఈ, ఒమన్లో జరిగే మ్యాచ్ల కోసం టిక్కెట్లన్నీ దాదాపుగా అయిపోయాయి. ఫ్యాన్స్ నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని టిక్కెట్లు విడుదల చేస్తున్నాం. వీలైనంత ఎక్కువగా స్టేడియాల్లో ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సురక్షిత వాతావరణంలో టోర్నీ జరిగేలా స్థానిక ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. అన్ని వేదికల్లో కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ అన్నాడు. ఇప్పటికే చాలా వరకు టిక్కెట్లు అమ్ముడుపోగా https://www.t20worldcup. com/లో మరిన్ని అందుబాటులో ఉన్నాయి.