మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్కు కొనసాగింపు అన్నట్లు యూపీ-గుజరాత్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే ప్రతీ పోరు కీలకమైన నేపథ్యంలో విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో తుదికంటా పోరాడుతున్నారు. తెలుగు యువ పేసర్ శబ్నమ్ షకీల్ ధాటికి యూపీ ఓటమివైపు నిలిచింది. దీప్తిశర్మ అజేయ అర్ధసెంచరీతో చెలరేగినా.. యూపీని గెలిపించలేకపోయింది. యూపీపై గుజరాత్ గెలుపుతో ప్లేఆఫ్స్ రేసు రసకందాయంలో పడింది. మిగిలిన రెండు బెర్తుల కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి.
న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు జోరందుకుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై తమ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన స్థానాల కోసం బెంగళూరు, యూపీ, గుజరాత్ పోటీపడుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో యూపీ నిరాశపరిచింది. సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో యూపీ 8 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. గుజరాత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ 144/5 స్కోరుకు పరిమితమైంది. ఏపీ యువ పేసర్ శబ్నమ్ షకీల్(3/11) ధాటికి యూపీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఆల్రౌండర్ దీప్తిశర్మ(60 బంతుల్లో 88 నాటౌట్ 9ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 152/8 స్కోరు చేసింది. కెప్టెన్ బేత్ మూనీ(52 బంతుల్లో 74 నాటౌట్, 10 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా, లారా వోల్వర్డ్(43) ఆకట్టుకుంది. దీప్తిశర్మ రెండు వికెట్లు తీసింది. ఏపీకి చెందిన 16 ఏండ్ల శబ్నమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
శబ్నమ్ విజృంభణ:
గుజరాత్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దిగిన యూపీకి ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లోనే శబ్నమ్..కెప్టెన్ అలిసా హిలీ(4), చమరి ఆటపట్టు(0) ఔట్ చేసి యూపీ పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. వీరిని అనుసరిస్తూ కిరణ్ నవగిరె(0)ను క్యాథరిన్ డాకౌట్ చేయగా, ఫామ్లో ఉన్న గ్రేస్ హ్యారిస్(1) కూడా నిరాశపరిచింది. దీంతో 16/4 స్కోరుతో కష్టాల్లో కూరుకుపోయిన దశలో దీప్తిశర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజానెత్తుకుంది. దీప్తికి మద్దతు ఇస్తుందనుకున్న శ్వేతా సెహ్రావత్(8)ను శబ్నమ్ పెవిలియన్కు పంపడంతో యూపీ కష్టాలు మరింత పెరిగాయి. ఈ తరుణంలో దీప్తి తాను ఉన్నానంటూ బ్యాటు ఝులిపించింది. పూనమ్ ఖెమ్నర్ మద్దతుతో దీప్తి ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఎదురైనా బౌలర్నల్లా బాదుతూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయింది. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న దీప్తి..విజయంపై కన్నేసింది. యూపీ గెలుపునకు చివరి 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్లో మేఘనా సింగ్ మూడే పరుగులు ఇచ్చుకుంది. తనూజ వేసిన తర్వాత ఓవర్లో ఖెమ్నర్ రెండు ఫోర్లు సహా 14 పరుగులు రాబట్టింది. దీంతో చివరి ఓవర్లో 26 పరుగులు అవసరమయ్యాయి. దీప్తి రెండు భారీ సిక్స్లకు తోడు రెండు సింగిల్స్ తీయడంతో చివరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమైన దశలో రెండు పరుగులే రావడంతో యూపీ ఓటమి ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 152/8 (మూనీ 74 నాటౌట్, వోల్వర్డ్ 43, ఎకల్స్టోన్ 3/38), యూపీ: 20 ఓవర్లలో 144/5 (దీప్తిశర్మ 88 నాటౌట్, శబ్నమ్ 3/11)