Siraj @ No 1 | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో మన హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మెరిశారు. చాలా రోజుల తర్వాత ఐసీసీ మెన్స్ ర్యాంకింగ్స్లో చోటు పొంది భారత్కా షాన్ అనిపించుకున్నాడు. ఈ జాబితాలో మన మరో బౌలర్ మహమ్మద్ షమీ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఎంఆర్ఎఫ్ ఐసీసీ మెన్స్ వన్ డే ర్యాంకింగ్స్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. వన్డేల్లో భారత్ నంబర్ వన్ పొజిషన్కు చేరింది.
కొన్నాళ్లుగా మంచి ప్రదర్శన చూపుతున్న సిరాజ్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో తొలి స్థానాన్ని అందుకున్నాడు. ఇటీవల ముగిసిన శ్రీలంక సిరీస్తోపాటు న్యూజిలాండ్ సిరీస్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ జట్టును 3-0 తో సిరీస్ కైవసం చేసుకోవడంలో భారత జట్టుకు తురుపుముక్కలా సిరాజ్ ఉన్నారు. ఈ సిరీస్లో రెండు మ్యాచులాడిన సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ హోం పిచ్పై జరిగిన మ్యాచ్లో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి భారత్ విజయం కీలక పాత్ర పోషించారు. అలాగే, శ్రీలంకతో జరిగిన వన్డేల్లో కూడా తన జోరును కొనసాగించారు. ఈ సిరీస్లో మొత్తం 9 వికెట్లు తీసి ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి ఎగబాకాడు.
న్యూజిలాండ్ సిరీస్లో సిరాజ్ కొత్త బాల్ భాగస్వామి మహ్మద్ షమీ కూడా రెండు మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టి ర్యాంకింగ్స్లో 11 స్థానాలు ఎగబాకి 32 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సీమ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ చెరో 6 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. యాదవ్ 21వ స్థానం నుంచి 19వ స్థానానికి ఎగబాకగా, ఠాకూర్ 5 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో ఇప్పటివరకు నంబర్ 1 స్థానాన్ని భారత బౌలర్లు కపిల్ దేవ్, మణిందర్ సింగ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు.