న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు. టీ20 వరల్డ్కప్లో కివీస్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్కు రవిశాస్త్రి, కోహ్లీలు హాజరుకాలేదు. అయితే ఈ అంశంపై ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ మ్యాచ్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి లేదా కోహ్లీ .. మీడియా సమావేశానికి హాజరు కావాల్సి ఉండాల్సింది అన్నారు. అయితే ఆ సమావేశానికి స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా హాజరుకావడాన్ని అజారుద్దీన్ తప్పుపట్టారు. ఇది ఏరకంగా ఆమోద్యయోగం కాదన్నారు. నా అభిప్రాయంలో హెడ్ కోచ్ మీడియా సమావేశానికి హాజరుకావాలి, ఒకవేళ విరాట్ హాజరుకావాలని లేకుంటే దాంతో సమస్య లేదు. కానీ కోచ్ రవిశాస్త్రి మాత్రం కచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరుకావాల్సి ఉందని అజార్ అన్నారు.
మ్యాచ్లు గెలిస్తేనే ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరుకావడం కాదు, ఓటమి పట్ల కూడా వివరణ ఇవ్వాలని, బుమ్రాను ప్రెస్ కాన్ఫరెన్స్కు పంపడం సరికాదన్నారు. కెప్టెన్ లేదా కోచ్ మీడియా సమావేశానికి రావాలని, కనీసం కోచింగ్ స్టాఫ్లో ఎవరో ఒకరు ఉండాలన్నారు. కోహ్లీ, శాస్త్రిలు మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఓటమి పట్ల సిగ్గు పడాల్సిన అవసరం లేదని అజార్ అన్నారు. కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఓడిపోతే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని, కానీ కెప్టెన్ లేదా కోచ్ ఓటమి పట్ల వివరణ ఇవ్వాలన్నారు. ఆ ప్రశ్నలకు బుమ్రా నుంచి సమాధానం ఆశించలేమన్నారు.