Mohammad Siraj : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు(Team India) చారిత్రాత్మక విజయంలో భాగమైన పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) తీరిక సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఈ స్పీడ్స్టర్ తాజాగా హైదరాబాద్లో తన స్నేహితుడి పెండ్లి వేడుకలో సందడి చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఖవ్వాలీ(Qawwali) కచేరీ వింటూ మస్త్ ఎంజాయ్ చేశాడు.
సిరాజ్ రాకతో సంతోషంలో మునిగిపోయిన స్నేహితులు అతడిపై, ఖవ్వాలీ గాయకుడిపై డబ్బులు విసురుతూ హంగామా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ మ్యాచ్లతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ హైదరాబాదీ పేసర్ సిరాజ్.. అనతికాలంలోనే భారత జట్టుకులో కీలక బౌలర్గా ఎదిగాడు. ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో శ్రీలంకపై సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన ఈ స్పీడ్స్టర్.. దక్షిణాఫ్రికాతో న్యూలాండ్స్(Newlands)లో జరిగిన రెండో టెస్టులో నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్లో సంచలన బౌలింగ్తో 6 వికెట్లు తీసి సఫారీలను చావు దెబ్బ కొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్లోనూ ఒక వికెట్ పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. సఫారీ పర్యటన తర్వాత అఫ్గనిస్థాన్తో టీ20 సిరీస్కు దూరమైన సిరాజ్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆడనున్నాడు. అనంతరం ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఈ స్టార్ పేసర్ బరిలోకి దిగనున్నాడు.