Mohammad Kaif : సొంతగడ్డపై వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు ఆఖరి మెట్టుపై తడబడింది. 12 ఏండ్ల తర్వాత స్వదేశంలో కప్ కొడుతుందనుకుంటే రోహిత్ సేన అనూహ్యంగా చతికిలపడింది. వాంఖడేలో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఓటమిని ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ‘స్లో పిచ్ను తయారుచేసి కప్పు పోగొట్టారు?’ అని క్యూరేటర్పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టైటిల్ పోరులో రోహిత్ సేన ఓటమిపై మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) సంచలన కామెంట్స్ చేశాడు.
టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్లే కారణమని కైఫ్ కుండబద్ధలు కొట్టాడు. ‘ఫైనల్కు ప్రతి మూడు రోజుల ముందు రోహిత్, ద్రవిడ్లు పిచ్ను పరిశీలించారు. గంటకు పైగా పిచ్ను చూస్తుండిపోయారు. అయితే.. పిచ్ రంగు మారడం నేను గమనించాను. పిచ్పై అసలు నీళ్లు పోయలేదు. దాంతో, గడ్డి కొంచెం కూడా కనిపించలేదు.
ఆస్ట్రేలియా (Australia)కు స్లో ట్రాక్ ఇద్దామని వాళ్లిద్దరూ భావించారు. అదే నిజం. వాంఖడే పిచ్ అలా ఉండడాన్ని అభిమానులు నమ్మలేకపోయారు. కమిన్స్, స్టార్క్లను దృష్టిలో పెట్టుకొని స్లో పిచ్ రూపొందించారు. అసలు.. రోహిత్, ద్రవిడ్లు పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టీమిండియా కప్ గెలవకపోవడానికి కారణం వాళ్లే’ అని కైఫ్ వెల్లడించాడు.
నిరుడు జరిగిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా 10 విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టింది. కానీ, ఫైనల్లో మాత్రం సాధారణ జట్టులా ఆస్ట్రేలియాకు తలవంచింది. భారత టాపార్డర్ విఫలమైన చోట ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో చెలరేగి ఆసీస్కు ఆరో ట్రోఫీ అందించాడు. టీమిండియా 11 ఏండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. ధోనీ సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా ఆ తర్వాత ఒక్క ట్రోఫీ గెలవలేదు.