Pakistan Cricket: వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత సుమారు మూడు నెలల పాటు విజయానికి మొహం వాచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై కొంతకాలంగా విమర్శల జడివాన కురుస్తున్నది. కెప్టెన్లు మారినా కోచింగ్ సిబ్బంది మారినా ఆ జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడగా న్యూజిలాండ్లోనూ తృటిలో వైట్వాష్ ను తప్పించుకుంది. అయితే పాక్ ఓటముల నేపథ్యంలో మాజీ క్రికెటర్లంతా ఆ జట్టుకు టీమ్ డైరెక్టర్ కమ్ హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ను నిందిస్తుండటంతో తాజాగా అతడు స్పందించాడు. క్రికెటర్లు సరిగా ఆడటం లేదని, వారిలో ఫ్రాంచైజీ క్రికెట్ మీద ఉన్న ఆసక్తి దేశానికి ఆడేప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు.
పాకిస్తాన్ మీడియా సంస్థ ‘జియో న్యూస్’లో వచ్చిన కథనం మేరకు.. ‘పాక్ క్రికెటర్లు ఆటపై పూర్తి దృష్టి సారించలేదు. వాళ్లు ఫ్రాంచైజీ టీమ్లకు చూపించేంత అటెన్షన్.. జాతీయ జట్టుమీద పెట్టలేదు. ఫ్రాంచైజీల తరఫున ఆడేందుకు తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) దక్కుతుందా..? లేదా..? అని టెన్షన్ పడుతుండేవాళ్లు..’ అని పీసీబీ అధికారులకు వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తున్నది. తాజాగా అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినట్టూ వార్తలు వస్తున్నాయి.
Pakistan Cricket Team Director Mohammad Hafeez has stated that players were not fully focused during the recent New Zealand tour, they were more worried about the NOC to play leagues. #BPL2024 #BabarAzam𓃵 #PSL2024 pic.twitter.com/DNO09Dljzs
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) January 25, 2024
ప్రపంచకప్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. కోచ్గా ఉన్న మికీ ఆర్థర్తో పాటు ఇతర ఫారెన్ సిబ్బందిని తప్పించి హఫీజ్, ఉమర్ గుల్ వంటి మాజీలను నియమించింది. కానీ పాకిస్తాన్ ఆసీస్ టూర్లో ఆడిన మూడు టెస్టులలోనూ ఓడింది. తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి నాలుగు మ్యాచ్లనూ ఓడింది. సుమారు 80 రోజుల దాకా ఆ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో విజయం దక్కలేదు. ఎట్టకేలకు ఆఖరి టీ20లో గెలిచి పరువు కాపాడుకుంది.