టీమ్ఇండియా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లు సిద్ధమవుతున్నది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఎలాగైనా విజేతగా నిలువాలన్న పట్టుదలతో ఉన్న భారత్..సుదీర్ఘ లక్ష్యం ఎంచుకున్నది. మెగాటోర్నీకి 18 నెలల సమయమున్నా..ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నది. బిగ్త్రీ రోహిత్శర్మ, విరాట్కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండా శ్రీలంకతో సిరీస్లో బరిలోకి దిగుతున్న భారత్కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. భవిష్యత్ టీ20 కెప్టెన్గా భావిస్తున్న పాండ్యా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంచలన విజయాలతో అంచనాలకు భిన్నంగా రాణిస్తున్న లంక..భారత్ను నిలువరించాలన్న పట్టుదలతో ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం తొలి టీ20 జరుగనుంది.
ముంబై: 2023 సంవత్సరాన్ని విజయంతో ఆరంభించేందుకు భారత్ తహతహలాడుతున్నది. మెగాటోర్నీల పరంగా గత కొన్నేండ్లుగా తీవ్రంగా నిరుత్సాహ పరుస్తున్న టీమ్ఇండియా ఈసారైనా అభిమానుల అంచనాలు అందుకుంటుందో అన్నది చూడాలి. మంగళవారం భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 పోరుతో మూడు మ్యాచ్ల సిరీస్కు తెరలేవనుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ క్రికెటర్లు తహతహలాడుతున్నారు.
ముఖ్యంగా దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్, జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్, ముకేశ్కుమార్ సత్తాచాటాలని చూస్తున్నారు. మరోవైపు అంచనాలను తలకిందులు చేస్తూ ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలం క..భారత్కు షాక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నది. యువకుల మేళవింపుతో పొట్టి ఫార్మాట్కు తగ్గట్లు పటిష్ఠంగా కనిపిస్తున్న లంక..తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించడంలో ఒకింత ముందంజలో ఉంటుంది.
కిషన్, గైక్వాడ్ ఓపెనింగ్:
లంకతో తొలి పోరులో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలోమెరుపు డబుల్ సెంచరీతో కదంతొక్కిన కిషన్పై టీమ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. గైక్వాడ్ జతగా కిషన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే..శుభ్మన్ గిల్ అరంగేట్రానికి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడో డౌన్లో సూర్యకుమార్, ఆ తర్వాత దీపక్ హుడా, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాతో మిడిలార్డర్లో బలంగా కనిపిస్తున్నది.
ఒక వేళ శాంసన్ను కాదనుకుంటే అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశమివ్వవచ్చు. బౌలింగ్ విషయానికొస్తే పాండ్యాకు చాలా వనరులున్నాయి. అర్ష్దీప్సింగ్, హర్షల్పటేల్, ఉమ్రాన్ మాలిక్ పేస్ దళాన్ని నడిపించనుండగా, స్పిన్నర్ చాహల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ బలంగా ఉండాలని ఒకవేళ భావిస్తే ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వైపు మొగ్గుచూపచ్చు.
లంక సత్తాచాటాలని
టీ20 ప్రపంచకప్ తర్వాత తొలి సిరీస్ ఆడుతున్న శ్రీలంక సత్తాచాటాలని చూస్తున్నది. లంక ప్రీమియర్ లీగ్ ముగించుకుని భారత్లో అడుగుపెట్టిన లంక..యువకులతో కళకళలాడుతున్నది. ముఖ్యంగా లంక లీగ్లో మెరుపులు మెరిపించిన అవిష్క ఫెర్నాండో, చమికా కరుణరత్నె, సదీరా సమరవిక్రమపై లంక భారీ ఆశలు పెట్టుకుంది.
జట్ల అంచనా:
భారత్: హార్దిక్(కెప్టెన్), కిషన్, గైక్వాడ్, సూర్యకుమార్, శాంసన్, దీపక్ హుడా, సుందర్, హర్షల్ పటేల్, అర్ష్దీప్సింగ్, మాలిక్, చాహల్
శ్రీలంక: షనక(కెప్టెన్), నిస్సానక, కుశాల్ మెండిస్, డిసిల్వా, అసలంక, రాజపక్స, హసరంగ, కరుణరత్నె, తీక్షణ, మదుషనక, లహిరు కుమార
టీ20 షెడ్యూల్
తొలి టీ20 : జనవరి 3 : ముంబై
రెండో టీ20 : జనవరి 5 : పుణె
మూడో టీ20 : జనవరి 7 : రాజ్కోట్