శామీర్పేట: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని పల్లెల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని అన్నారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో రూ.17 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఓఎస్డీ హరికృష్ణ, సాట్స్ అధికారులు పాల్గొన్నారు.
స్కూల్ మొత్తం మంత్రులు కలియదిరుగుతూ ప్లేయర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అన్ని రంగాల్లో వలే క్రీడలను అభివృద్ధి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో క్రీడా పాలసీని తీసుకురాబోతున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నెలకొల్పాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లను ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం’ అని అన్నారు. మంత్రులు కొద్దిసేపు సరదాగా ఫెన్సింగ్, ఆర్చరీ, వాలీబాల్ ఆడారు.