హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీపై క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. టోర్నీలో మండల స్థాయి ముగిసి ఈ నెల 22 నుంచి జిల్లా స్థాయి పోటీలు మొదలుకానున్న నేపథ్యంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
జిల్లా స్థాయిలో జరిగే పోటీలను ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, స్థానిక ప్రతినిధులు విజయవంతం చేయాలని సూచించారు. సీఎం కప్లో 18 క్రీడాంశాలకు సంబంధించి వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యే బాలకిషన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గౌరీశంకర్, శ్రీనివాస్యాదవ్, జాతీయ హ్యాండ్బాల్ సంఘం చీఫ్ జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.