హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన నిఖత్కు తగిన రీతిలో ప్రోత్సాహం దక్కింది. సోమవారం రవీంద్రభారతిలో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్.. జరీన్ తండ్రి జమీల్అహ్మద్కు జూబ్లీహిల్స్లో 600గజాలకు సంబంధించి పత్రాలను అందజేశారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరుగనున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో నిఖత్ తరఫున తండ్రి జమీల్ పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్ర కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న నిఖత్కు సీఎం ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు కోట్ల నగదు బహుమతి అందజేశాం. ఇంటి స్థలం పత్రాలు తండ్రి జమీల్కు ఇచ్చాం. గ్రూపు-1 పోస్ట్ అయిన డీఎస్పీ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని త్వరలో అందజేస్తాం’ అని అన్నారు. జమీల్ స్పందిస్తూ ‘నిఖత్ ప్రతిభను గుర్తిస్తూ సీఎం కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టడం మరిచిపోలేని సందర్భం. రెండు కోట్ల నగదు, విలువైన ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.