నిజామాబాద్కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిక్కత్ జరీన్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నిక్కత్ జరీన్ కు స్పోర్ట్స్ కోటా కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం కల్పించిన సందర్భంగా మంత్రి అభినందించారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నిక్కత్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ క్రీడలో అద్భుత ప్రదర్శన చేస్తున్నదని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాకారులకు, క్రీడల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను, నగదు పురస్కారాలను గతంలో కంటే నేడు భారీగా అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధి కి నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా త్వరలోనే మంచి క్రీడా పాలసీని తయారుచేయబోతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివకుమార్, జయప్రకాష్ విద్యాసంస్థల ఛైర్మన్ రవికుమార్, నిక్కత్ జరీన్ తండ్రి జమీల్ తదితరులు పాల్గొన్నారు.