Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారని, ఆయన ఆట తీరు అద్భుతమని కేటీఆర్ ప్రశంసించారు.
టీమిండియా 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసి మెగా టోర్నీలో శుభారంభం చేసింది. నిరుడు యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో పాక్ చేతిలో పరాజయం పాలైన భారత్.. ఆ ఓటమికి ఘనంగా బదులు తీర్చుకుంది.
90 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తిఖార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4)తో పాటు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్శ్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్కు ఇరుసులా నిలబడగా.. హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40; ఒక ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరినా.. కడవరకు క్రీజులో నిలిచిన కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవుఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విరాట్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. టీమ్ఇండియా తమ తదుపరి మ్యాచ్లో గురువారం నెదర్లాండ్స్తో తలపడనుంది.
Watched some of the highlights of India – Pak game
What a brilliant knock! King Kohli, take a bow man 👏👏
— KTR (@KTRTRS) October 24, 2022